నర్మెట, జనవరి 31 : బీరుసీసాలో తేలు ప్రత్యక్షమైన ఘటన మంగళవారం సాయంత్రం మండల కేంద్రంలో జరిగింది. నర్మెటకు చెందిన కన్నెబోయిన కరుణాకర్, మరో వ్యక్తితో కలిసి మండల కేంద్రంలోని తిరుమల వైన్స్లో మంగళవారం రెండు బీర్లు కొనుగోలు చేశారు. పక్కనే ఉన్న హోటల్లో వాటిని ఓపెన్ చేసి గ్లాసులో బీరు పోసుకున్నారు. కొంచెం తాగగానే దుర్వాసన రావడంతో బీరు బాటిల్ను పరిశీలించి చూడగా అందులో తేలు కనిపించింది.
వెంటనే అవాక్కయిన వారు బీరు సీసాను తీసుకుని షాపు యజమాని వద్దకు వెళ్లి ప్రశ్నించగా నీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మద్యం షాపు ఎదుట కాసేపు బైఠాయించారు. ఈ విషయమై పలువురు ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. ఈ విషయమై వివరణ కోరేందుకు ఎక్సైజ్ అధికారులకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. వైన్స్ను వెంటనే మూసి వేయించాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై మద్యం షాపు యజమానిని వివరణ కోరగా బీరు సీసాలో తేలు వచ్చిన విషయంలో తమ తప్పేమి లేదన్నారు.