మహబూబాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి వరంగల్ నుంచి ఏర్పడిన జిల్లాల్లో మహబూబాబాద్ ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు 2016 అక్టోబర్ 11న మానుకోటను కొత్త జిల్లాగా ఏర్పాటు చేసింది. జిల్లాకేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఎన్హెచ్-365 జాతీయ రహదారిని ఆనుకొని 33 ఎకరాల్లో రూ.62.50 కోట్లతో కొత్తగా కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించారు. జీప్లస్-2 విధానంలో నిర్మించిన ఈ సముదాయంలో కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లు, పరిపాలనాధికారి(ఏవో) కార్యాలయం సహా 33 ప్రభుత్వ శాఖలన్నీ ఒకే చోట ఉండేలా నిర్మించారు.
గ్రౌండ్ఫ్లోర్లో కలెక్టర్, అదనపు కలెక్టర్లతో పాటు ఇతర ముఖ్య అధికారుల చాంబర్లతో పాటు కాన్ఫరెన్స్ హాల్, మొదటి, రెండో అంతస్తులో వివిధ శాఖల కోసం నిర్మించారు. కలెక్టరేట్కు పనుల కోసం వచ్చే ప్రజలతో పాటు అధికారులు, సిబ్బంది, వీఐపీల వాహనాలు నిలిపేందుకు విశాల స్థలంలో పార్కింగ్ ఏర్పాటుచేశారు. కలెక్టరేట్ భవనం లోపలి వరకు సీసీరోడ్లు, కలెక్టరేట్ ఆవరణలో గార్డెన్లు ఏర్పాటు చేశారు.
రంగురంగుల పూలు, నీడనిచ్చే మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. కలెక్టరేట్ ఆవరణలోనే శాశ్వత హెలిప్యాడ్ నిర్మించారు. అలాగే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మానుకోట పట్టణాన్ని ముస్తాబు చేస్తున్నారు. గత నెల రోజుల నుంచి పనులు ముమ్మరంగా చేస్తున్నారు. అండర్బ్రిడ్జి వద్ద ఇప్పటికే సీసీరోడ్లు వేయడంతో పాటు బ్రిడ్జి గోడల లోపలి భాగంలో పలు చిత్రాలను పెయింటింగ్ వేశారు. ఇవి వాహదారులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
అన్ని సౌకర్యాలతో భవనం..
కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ కాంప్లెక్స్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అన్ని శాఖలకు విశాలమైన గదులు, కుర్చీలు, వసతులు ఉన్నాయి. కార్లు, ద్విచక్ర వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం ఉంది. వివిధ పనుల కోసం వచ్చే ప్రజల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. గతంలో 32 శాఖలు పది చోట్ల ఉండేవి. కొత్త కలెక్టరేట్లను నిర్మించడం వల్ల ప్రజలకు సేవలు మరింత సులభం అవుతాయి. పాత కలెక్టరేట్లో నాలుగైదు శాఖల సమావేశం పెట్టుకోవాలంటే హాల్ సరిపోకపోయేది. ఇప్పుడు ఎంత పెద్ద మీటింగ్ అయినా ఇక్కడే పెట్టుకోవచ్చు.
– కొమురయ్య, ఆర్డీవో, మహబూబాబాద్
అన్నింటా జిల్లా అభివృద్ధి
కొత్త కలెక్టరేట్తో జిల్లాకు కళ వచ్చింది. ఇక్కడ భూముల రేట్లు కూడా బాగా పెరిగాయి. కలెక్టరేట్ నిర్మించక ముందు ఎకరం లక్షల్లో ఉండేది. ఇప్పుడు కోట్లు పెట్టినా దొరకడం లేదు. జిల్లాకేంద్రంలోనే కలెక్టరేట్, మెడికల్ కాలేజీ నిర్మించడం వల్ల ఇక్కడ భూములకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. వ్యవసాయ భూములకు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతమైన మానుకోట జిల్లా అభివృద్ధిలో అంతంత మాత్రమే ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సార్ సీఎం అయిన తర్వాత జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది.
– వరుణ్, బయ్యారం, మహబూబాబాద్ జిల్లా
కొత్త కలెక్టరేట్తో కళ వచ్చింది
పాత కలెక్టరేట్లో అధికారులను కలుద్దామని వెళ్తే కూర్చుందామంటే కుర్చీలు సరిపోయేవి కావు. ఇప్పుడు అన్ని హంగులతో విశాలమైన స్థలంలో నిర్మించిన కలెక్టరేట్ చాలా బాగుంది. కలెక్టరేట్కు వచ్చే విజిటర్స్ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. కూర్చునేందుకు ప్రత్యేక విజిటర్ గది, సరిపడా కుర్చీలు ఉన్నాయి. కలెక్టరేట్కు వస్తే అన్ని శాఖల అధికారులను కలుసుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం సంతోషంగా ఉంది.
– షేక్ ఇమ్రాన్, బీసీ కాలనీ, మహబూబాబాద్