ఐనవోలు మే 23: ఆరుబయట నిద్రిస్తున్న బాలికపై వేపచెట్టు కొమ్మ విరిగి పడడంతో తీవ్రగాయాలై చనిపోయింది. ఐనవోలు మండలం నందనం గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన ఈఘటనపై కుటుంబ సభ్యులు, ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కన్నా సురేందర్, రజిత దంపతులకు కొడుకు శివశంకర వరప్రసాద్, కూతురు శ్రీజ (9) ఉన్నారు. ఎండాకాలం కావడంతో ఇంటి ఆవరణలో అన్న, చెల్లి ఒక మంచంలో పడుకున్నారు.
ఇంటికి అనుకొని జడ్పీ పాఠశాల కంపౌండ్ వాల్ ఉంది. పాఠశాల ఆవరణలో సుమారు 40 ఏళ్ల నాటి రెండు వేపచెట్లు వీరి ఇంటి మీదకు ఒరిగి ఉన్నాయి. దానికిందే వీరు పడుకోగా, గాలిదుమారం లేకున్నా ఉన్నట్టుండి రాత్రివేళ ఒక్కసారిగా చెట్టుకొమ్మ విరిగి శ్రీజపై పడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, తల్లిదండ్రులు వెంటనే దవాఖానకు తరలిస్తుండగా మర్గమధ్యలో ప్రాణాలు వదిలింది. మంగళవారం ఉదయం ఎస్ఐ వెంకన్న సిబ్బందితో చేరుకొని పాప మృతదేహన్ని పోస్టుమార్టం కోసం వైద్యశాలకు తరలించారు. మృతురాలి తండ్రి సురేందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
చెవులు కుట్టించే ఫంక్షన్కు ఏర్పాట్లు..
శ్రీజకు ఈనెల 26న చెవులు కుట్టించే ఫంక్షన్ కోసం తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే తమ కూతురికి కొత్త బట్టలు, బంగారం కొన్నారు. బంధువులకు సమాచారం ఇచ్చే పనిలో పడ్డారు. ఇంతలోనే ఇలా జరగడంతో ఫంక్షన్కు రావాల్సిన వారు పాప చావుకు రావాల్సి వస్తున్నదా అని ఆమె తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరుల కంటతడిపెట్టించింది. చెట్టు కొమ్మలు తొలగించాలని గతంలోనే కోరామని, అప్పుడే తొలగించి ఉంటే తమ పాపకు ఈ గతి పట్టి ఉండకపోవు నని గుండెలు బాదుకున్నారు.
బావిలో పడి బాలుడు
చెన్నారావుపేట, మే 23 : బర్రెలను మేపేందుకు వెళ్తున్న స్నేహితులతో సరదాగా వెళ్లిన బాలుడు బావిలో పడి చనిపోయాడు. చెన్నారావుపేట మం డలం బోజెర్వు గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబూబాద్ జిల్లా గూడూరు మండలం అప్పర్లపల్లికి చెందిన కాసాని మల్లయ్య-రవళి దంపతుల కొడుకు రాజేశ్(11) వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరైనా బోజెర్వుకు వచ్చాడు. స్నేహితులు బర్రెలను మేపేందుకు గ్రామ శివారుకు వెళ్తుండగా వారితో కలిసి సరదాగా వెళ్లాడు. అక్కడ ఓ కూలిపోయిన బావిలో ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడు. స్నేహితులు కేకలు వేయడంతో చట్టుపక్కల వారు వచ్చి బాలుడిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. ఎస్ మహేందర్ సిబ్బందితో చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో బాలుడి మృతదేహాన్ని బయటకు తీయించారు. తల్లి రవళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.