టేకుమట్ల, మార్చి 19 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ జెట్ విమానం భూమికి అతి సమీపంలో చక్కర్లు కొడుతున్నది. గత వారం రోజులుగా రోజుకు 4-5 రౌండ్లు తిరుగుతున్నది. వివరాలిలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం, పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలాలను విడదీసే మానేరు వాగు సరిహద్దు గ్రామాల పైనుంచి విమానం వారం రోజులుగా తిరుగుతున్నది. దీంతో ఎంపేడు, కుందనపల్లి, బూర్నపల్లి, వెంకట్రావ్పల్లి, ద్వారకాపేట, రామకృష్ణాపూర్(వీ), బోయినపల్లి, కలికోటపల్లి గ్రామాల ప్రజలు, రైతులు విమానం ఎందుకు తిరుగుతుందో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. అయితే భూగర్భ జలవనరుల శాఖ అధికారులు సర్వే చేస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం లేదు.