కమలాపూర్, జనవరి 2: కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలతో తమ హక్కులను కాలరాస్తోందని హెచ్పీసీఎల్ లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్) గ్యాస్ ప్లాంట్ లారీడ్రైవర్లు మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 140, 2 జీవోలు తీసుకురావడం వల్ల వాహన ప్రమాదం జరిగితే డ్రైవర్లదే బాధ్యతగా రూ.7లక్షల జరిమానా, 10ఏళ్ల జైలు శిక్ష విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమ కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని, వెంటనే ఆ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డ్రైవర్ల అధ్యక్షుడు ధర్ముల ప్రతాప్, ఉపాధ్యక్షుడు వంగ కిరణ్, కోశాధికారి మారెల్ల శ్రీనివాస్, పోతిరెడ్డి కోటి పాల్గొన్నారు.