శాయంపేట, సెప్టెంబర్ 11 ;పత్తిపాక సరారు బడి కార్పొరేట్కు దీటుగా సరికొత్త హంగులతో మెరిసిపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కింద ఇక్కడి ప్రాథమిక పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాలల ఆధునీకరణకు రూ.90లక్షలు మంజూరు చేసి రూపురేఖలను మార్చేసింది. ఈ నిధులతో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అదనపు తరగతి గదులు, తాగునీరు, మోడ్రన్ టాయిలెట్స్, విద్యుత్ సౌకర్యం, డైనింగ్ హాల్ నిర్మించి రంగులు వేయడంతో కొంగొత్త కళను సంతరించుకున్నది. ఒక సాధారణ పాఠశాల కేసీఆర్ సర్కారు చొరవతో సకల సౌకర్యాలతో మెరుగుపడడంతో ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాక మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలు అన్ని సౌకర్యాలతో సరికొత్త అందాలను అద్దుకున్నాయి. రెండు పాఠశాలలు ఒకే ప్రాంగణంలో కొనసాగుతుండగా ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.90లక్షలు మంజూరుచేసి అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దడంతో ఇది సర్కారు పాఠశాలేనా అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వం పేద పిల్లలు చదువుకొనే సరారు పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తయారుచేయాలన్న లక్ష్యంతో ‘మన ఊరు-మన బడి పథకం’ అమలుచేస్తున్న ఫలితంగా ఈ బడికి కొత్త కళ వచ్చింది.
ఆధునీకరణకు వెల్లువలా నిధులు
పత్తిపాక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు, జడ్పీహెచ్ఎస్లో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు అభ్యసిస్తున్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, సౌకర్యాలను ‘మన ఊరు-మనబడి’ పథకంలో కల్పించారు. ప్రాథమిక పాఠశాలలో రూ.23.49 లక్షలతో రెండు అదనపు తరగతి గదులను నిర్మించారు. అలాగే రూ.8.89 లక్షలతో ఫ్లోరింగ్, ప్లాస్టింగ్ వంటి మేజర్, మైనర్ మరమ్మతులు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. రూ.2.59 లక్షలతో ఎలక్ట్రికల్ వైరింగ్ పనులు చేసి విద్యుత్తును మెరుగుపరిచారు. విద్యార్థులకు తాగునీటి కోసం రూ.1.39 లక్షలతో సంప్, ట్యాంక్, హ్యాండ్వాష్లను ఏర్పాటుచేశారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రూ.6.40లక్షలతో బాలురు, బాలికలకు వేరువేరుగా రెండు మోడ్రన్ మూత్రశాలలను నిర్మించారు.
మొత్తంగా ప్రాథమిక పాఠశాలలో రూ.46.76 లక్షల నిధులతో విద్యార్థులకు సౌకర్యాలను కల్పించారు. అలాగే జిల్లా పరిషత్ హైసూల్లో రూ.12.98 లక్షలతో మరమ్మతులు చేశారు. పాఠశాలలోని అన్ని గదుల్లో ఫ్లోరింగ్, మెట్లు నిర్మించారు. అలాగే రూ.17.89 లక్షలతో విద్యార్థులు భోజనం చేసేందుకు వీలుగా విశాలమైన డైనింగ్ హాల్ నిర్మించారు. రూ.3.89 లక్షలతో ఎలక్ట్రికల్ వైరింగ్ రూ.1.29లక్షలతో తాగునీటి సౌకర్యం కల్పించారు. ప్రత్యేకంగా విద్యార్థులకు ఉపయోగపడే ట్యాప్స్ అమర్చారు. రూ.6.04 లక్షలతో బాలురు, బాలికలకు వేర్వేరుగా టాయిలెట్స్ కట్టించారు. మొత్తంగా జడ్పీ హైస్కూల్ కోసం మొత్తం రూ.42.55 లక్షలు ఖర్చు చేసి విద్యార్థులకు సౌకర్యాలను కల్పించి విద్యావ్యవస్థకు పెద్దపీట వేసింది ప్రభుత్వం. దీంతో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.