వరంగల్, మార్చి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):కొత్త పనులు ఇలా..ఒకటో మినీ లిఫ్ట్ గండిరామారం రిజర్వాయర్ ఫోర్షోర్ వద్ద పంపుహౌజ్, ప్రెజర్ మెయిన్ నిర్మాణంతోపాటు ఈ రిజర్వాయర్ నుంచి కన్నారం చెరువుకు పైపులైను, అక్కడి నుంచి గ్రావిటీతో కన్నారం, అంకుషాపూర్ చెరువులకు పైపులైన్. రెండు పైపులతో 14 గ్రామాల్లోని 23 చెరువులకు నీరు చేరుతుంది. 3,354 ఎకరాలకు సాగునీరు అందుతుంది. రూ.63.80కోట్లతో చేపట్టిన ఈ పనులతో లింగంపల్లి, శ్రీపతిపల్లి, కొండాపూర్, మద్దెలగూడెం, కన్నారం, పీచర, అబ్దుల్నాగారం, నర్సాపూర్, తరిగొప్పుల, సోలిపురం, పోతారం, అంకుషాపూర్, బొంతగట్టునాగారం, కూటిగల్ గ్రామాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుంది.
స్వరాష్ట్రంలో మన నిధులు, మన నీళ్లు మనకే దక్కుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అవసరమైన పనులన్నీ చేస్తున్నది. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండు పంటలకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. సీఎం కేసీఆర్ ఇప్పటికే దేవాదుల ప్రాజెక్టును పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకే కేటాయించారు. ఈ ప్రాజెక్టుతో 6.21లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని కొన్ని రిజర్వాయర్ల కింద సాంకేతిక కారణాలతో సాగునీరు అందని ప్రాంతాలను గుర్తించి ప్రతి ఎకరానికి అందించేలా కొత్తగా మూడు లిఫ్టులను నిర్మిస్తున్నది. దేవాదుల ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికీ సాగునీరు అందని ఎగువ ప్రాంతాలను పచ్చగా మార్చే లక్ష్యంతో మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు వారం క్రితం మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.104కోట్లతో చేపట్టే ఈ పనులతో కొత్తగా 6,794 ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందనున్నది. హనుమకొండ, జనగామ, సిద్ధిపేట జిల్లాల పరిధిలోని స్టేషన్ఘన్పూర్, హుస్నాబాద్, జనగామ, వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లోని చిల్పూరు, వేలేరు, తరిగొప్పుల, ధూల్మిట్ట, ధర్మసాగర్, ఐనవోలు మండలాలకు చెందిన 30 గ్రామాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందనున్నది.
2021 జూన్ 21న సీఎం కేసీఆర్ వరంగల్కు వచ్చారు. హనుమకొండ కలెక్టరేట్ను ప్రారంభించి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో దేవాదులపై సమీక్ష నిర్వహించారు. దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్క బరాజ్ పూర్తయ్యాయని, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తికావడంతో 7.5టీఎంసీల నీరు ఏడాది మొత్తం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ‘ఇప్పటినుంచి దేవాదుల ప్రాజెక్టు వరంగల్కే అంకితం. ప్రతి గ్రామం, ప్రతి చెరువుకు నీరు చేరాలని, ప్రత్యేకంగా రూ.100కోట్ల గ్రాంటు ఇస్తున్నా. ఈ పనులను త్వరగా పూర్తి చేసేలా దీనికి అనుగుణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలి. జనగామ, స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట, సంగెం ప్రాంతాల్లో ఎక్కడా ఒక్క ఊరు మిగిలిపోవద్దు’ అని ఆదేశించారు. ఈమేరకు సాగునీటి శాఖ అధికారులు సర్వే చేసి పనులను ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఆమోదించింది. రూ.104కోట్లతో పనులు మొదలయ్యాయి. ఈ పనులను త్వరగా పూర్తి చేసేలా సాగునీటి శాఖ చర్యలు చేపట్టింది.
రెండో మినీ లిఫ్ట్ : ధర్మసాగర్ – గండిరామారం రిజర్వాయర్ల మధ్య ప్రెజర్ మెయిన్ పైపులైన్ను గుండ్లసాగర్ నుంచి వేలేరు పెద్ద చెరువుకు విస్తరించడమే దీని లక్ష్యం. దీంతో ఆరు గ్రామాల్లోని 12 చెరువులకు నీరు చేరుతుంది. 1,620 ఎకరాలకు సాగునీరు అందుతుంది. రూ.9.70కోట్లతో చేపట్టిన ఈ పనులతో ముప్పారం, నారాయణపురం, వేలేరు, షోడశపల్లి, మల్లికుదుర్ల, శాలపల్లి గ్రామాలకు రెండు పంటలకు సాగునీరు సౌకర్యం కలుగుతుంది.
మూడో మినీ లిఫ్ట్ : నష్కల్ రిజర్వాయర్ ఫోర్షోర్ వద్ద పంపుహౌజ్తోపాటు ఈ రిజర్వాయర్ నుంచి వంగపల్లి, ధర్మాపూర్, మల్లక్పల్లి చెరువులకు నీరు చేరేలా పైపులైన్ నిర్మాణం. పది గ్రామాల్లోని 18 చెరువులకు నీరు చేరుతుంది. రూ.31.42కోట్లతో చేపట్టిన ఈ పనులతో వంగపల్లి, ధర్మపురం, మల్లక్పల్లి, వనమాలకనపర్తి, కొండపర్తి, వెంకటాపురం, ఐనవోలు, సింగారం, పున్నేలు, పంథిని గ్రామాల్లో రెండు పంటలకు సరిపడా అందుతుంది.