ముసురుతో మొదలైన వాన రెండు రోజులుగా తెరిపినివ్వడం లేదు. ఉమ్మడి వరంగల్లో కొన్ని జిల్లాల్లో మోస్తరుగా కురిస్తే, మరికొన్న చోట్ల వరదలై పారింది. వరుస వానలతో జనజీవనం స్తంభించిపోగా వాగులు, వంకలు, చెరువుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులతో పోల్చితే బుధవారం ఒక్కసారిగా పెరిగింది. అటు ఏజెన్సీ ప్రాంతంలో ముంపు ప్రభావం ఉండడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది.
– నమస్తే నెట్వర్క్, జూలై 19
ఉమ్మడి జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షం పడుతున్నది. ములుగు జిల్లాలో అత్యధికంగా 6.3 సెంటీమీటర్లు పడగా, జనగామలో 4, హనుమకొండ 2.2, వరంగల్ 2.7, జయశంకర్ భూపాలపల్లిలో 2.7, మహబూబాబాద్ జిల్లాలో సగటున 1.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. కాగా జఫర్గఢ్లో అత్యధికంగా 9.8 సెం.మీ వర్షపాతం రికార్టయింది. కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉప్పొంగి పారుతోంది. ఇటు తెలంగాణతో పాటు మహారాష్ట్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండడంతో కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు 4.50 లక్షల క్యూసెక్కులుగా వస్తూ పుష్కరఘాట్ వద్ద 9.55 మీటర్ల ఎత్తులో పారుతూ లక్ష్మీ బరాజ్ వైపు పరుగులు తీస్తున్నాయి. ఇలా గంటగంటకూ వరద పెరుగుతుండడంతో అధికారులు అక్కడే ఉండి గస్తీ కాస్తున్నారు. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. 12.60 మీటర్లకు వరద నీరు చేరుకుంది. మంగపేట మండలంలో నది ప్రవాహంతో కోతకు గురయ్యే తీర ప్రాంతాల వద్ద అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి నది బుధవారం సాయంత్రం 5గంటలకు 14.780 మీటర్ల్ల(45 అడుగుల) మేర చేరుకొని ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి ఉధృతి పెరగడంతో తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన టేకులగూడెం, పేరూరు వద్ద వరదను ఆర్డీవో సత్యపాల్రెడ్డి పరిశీలించారు. గోదావరి వరద ప్రభావంతో ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం(నూగూరు) మండలాల్లోని ముంపు ప్రాంతాలు, కోతకు గురయ్యే రోడ్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి వరద నష్టం సంభవించకుండా కలెక్టర్ త్రిపాఠి టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచారు. జిల్లాలోని ప్రజలు ముంపునకు గురైన సమయంలో, ఇతర వైద్య సదుపాయాల కోసం టోల్ఫ్రీ నంబర్ 1800 4257109కు ఫోన్ చేయాలని తెలిపారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టి గ్రామం వద్ద జంపన్న వాగు వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామానికి చెందిన దబ్బకట్ల సునీత, చెరుకల శ్రీమతి అనే ఇద్దరు గర్భిణులు వాగు దాటేందుకు ఇబ్బంది పడ్డారు. ఏఎస్పీ సంకీర్త్ డిజాస్టర్, రెస్క్యూ ఫోర్స్ టీమ్ సహాయంతో వారిని వాగు దాటించి ఏటూరునాగారం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాలెం ప్రాజెక్ట్ ప్రధాన కాల్వకు ఒంటిమామిడి గ్రామ సమీపంలో గండి పడింది. అధికారులు గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండలంలోని తెలంగాణ నయాగరా బొగత జలపాతంతో పాటు స్విమ్మింగ్పూల్లోకి వరద నీరు భారీగా చేరడంతో అటవీ శాఖ ఉన్నత అధికారుల సూచన మేరకు ఎఫ్ఆర్వో చంద్రమౌళి జలపాత సందర్శనకు బుధవారం నుంచి అనుమతి నిలిపివేశారు. పర్యాటకులు వెళ్లకుండా ప్రధాన రహదారిపై అడ్డుగా బారికేడ్లు పెట్టారు. ఈ నేపథ్యంలో జలపాతం వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులను వెనక్కి పంపేశారు.