వరంగల్,జూన్ 9 : వరాలిచ్చే దేవుడి భూములకే శఠగోపం పెడుతున్నారు. వేలాది ఎకరాల మాన్యాలు అన్యాక్రాంతమవుతునాన్నా దేవాదాయ శాఖ చేతులు ముడుచుకొని చూస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరం నడిబోడ్డున ఉన్న భూములు సైతం ఆక్రమణకు గురైనా అధికారులు చోద్యం చూస్తున్నారు. దేవుడి మాన్యాలను పరిరక్షించుకోవడంలో ఆ శాఖ పూర్తిగా విఫలమవుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దేవాదాయ శాఖకు 2,312 ఎకరాల భూములున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే వీటి పరిరక్షణకు సంబంధించి రెవెన్యూ, పోలీసు శాఖలు సహకరించయపోవడంతో దేవాదాయ శాఖ అధికారులు ఒంటరి పోరాటం చేస్తున్నారు. వారు ఆక్రమణలకు గురైన భూముల వద్దకు అధికారులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో దేవుడి మాన్యాల ఆక్రమణలు జరుగుతున్నా చేసేదేమీ లేక అధికారులు మిన్నకుండిపోతున్నారు.
దేవుడి భూములు కబ్జాకోరుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,312 ఎకరాల భూమి దేవాదాయ శాఖకు చెందిన వివిధ దేవాలయాల మాన్యాలుగా రికార్డుల్లో ఉంది. ఉమ్మడి జిల్లాలో సన్నూరు వెంకటేశ్వస్వామి, మడికొండలోని మెట్టు రామలింగేశ్వరస్వామి ఆలయాలకే సుమారు 1,770 ఎకరాల వరకు భూములున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో సన్నూరు దేవాలయానికి సుమారు 898, రామలింగేశ్వరస్వామి అలయానికి 800 పైచిలుకు ఎకరాలున్నట్లు రికార్డుల్లో నమోదైంది. అయితే సన్నూరు మాన్యాలను అక్కడి రైతులు కౌలు చేసుకుంటున్నారు. మెట్టుగుట్ట రామలింగేశ్వరాలయానికి చెందిన వందల ఎకరాల్లో గ్రామాలు వెలిశాయి. అయితే కౌలు చేసుకుంటున్న రైతులు దేవాదాయ శాఖకు కౌలు చెల్లించడం లేదని అధికారులు వాపోతున్నారు. దీంతో పాటు మిగతా దేవాలయాలకు సంబంధించిన మాన్యాలు అనేకం కబ్జాకు గురయ్యాయి. నగరం నడిబొడ్డున కుంటి భద్రయ్య, వేంకటేశ్వరస్వామి ఆలయాలకు చెందిన భూములున్నాయి. వాటిలో పేదల కాలనీలు వెలిశాయి. వాటిని కాపాడుకునేందుకు దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ను ఆశ్రయించినట్లు అధికారులు చెబుతున్నారు.
దేవుడి మాన్యాలను పరిరక్షణకు ఆ శాఖ అష్టకష్టాలు పడుతున్నది. భూములకు హద్దులు ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖకు నిధుల కొరత అడ్డంకిగా మారుతున్నది. నగరంలోని కమర్షియల్ ప్రాంతాల్లో ఉన్న దేవాదాయ శాఖ భూములు కబ్జా కాకుండా ప్రహరీ నిర్మించుకోలేని దీనస్థితిలో ఆ శాఖ ఉంది. చాలా భూములకు ఎలాంటి ఫెన్సింగ్, బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. ఇటీవల నగరంలోని శాయంపేట వద్ద దేవాదాయ శాఖకు చెందిన భూమిని ప్రైవేట్ వ్యక్తులు కబ్జాకు యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. విలువైన దేవుడి భూములు కాపాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
దేవాదాయ శాఖ భూముల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. తొలుత ఉమ్మడి జిల్లాలోని దేవుడి మాన్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. దేవాదాయ రికార్డుల ప్రకారం భూములకు హద్దులు ఏర్పాటు చేసే ప్రయత్నాలు మొదలు పెడతాం. రెవెన్యూ, పోలీసు శాఖ సహకారంతో ముందుకు సాగుతాం. ఉమ్మడి జిల్లాలో 2,312 ఎకరాల్లో 466 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. వాటిపై ట్రిబ్యునల్ను ఆశ్రయించాం. ఇప్పటికే భూముల జియో ట్యాగింగ్ చేస్తున్నాం. పరకాల డివిజన్లో కోడింగ్ ప్రక్రియను పూర్తిచేశాం.
– కృష్ణప్రసాద్, జోనల్ డిప్యూటీ కమిషనర్, దేవాదాయ శాఖ