సుబేదారి, అక్టోబర్ 16 : పుష్ప సినిమా తరహాలో అనుమానం రాకుండా డీసీఎం వాహనంలో తరలిస్తున్న రూ.75 లక్షల విలువైన మూడు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సోమవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో సీపీ అంబర్ కిషోర్ ఝా వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం, కార్గావ్ జిల్లాకు చెందిన కోలి రాజావర్మ, మహారాష్ట్ర జల్గావ్ జిల్లా ఆకుల్దేడకు చెందిన పార్టిల్ నామ్దేవ్, రాహుల్ సబులే, శుభం గోతీరాం సబులే, శేషుకుమార్ ముఠాగా ఏర్పడి గంజాయి రవాణా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ -ఒడిషా సరిహద్దుల్లో తక్కువ ధరకు మూడు క్వింటాళ్ల గంజాయి కొనుగోలు చేసి రెండు కిలోల చొప్పున ప్యాకెట్లు తయారు చేశారు. ఇంటి పైకప్పులో పెంకులు అమర్చినట్లు గంజాయి ప్యాకెట్లు అమర్చి మీద తాడిపత్రి కప్పి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎల్కతుర్తి మండలం పెంచికల్పేట వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద టాస్క్ఫోర్స్, ఎల్కతుర్తి పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, ఇంజిన్ నంబర్కు తేడా ఉండడంతో అనుమానం వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో గంజాయి లభించింది. నిందితులు కోలి రాజావర్మ, పార్టిల్ నామ్దేవ్ను విచారించగా గంజాయి రవాణా చేస్తున్నట్లు అంగీకరించారు. మరో ముగ్గురు నిందితులు రాహుల్సబులే, శుభం గోతీరాం సబులే, శేషుకుమార్ పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు. ముఠాను పట్టుకున్న టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, కాజీపేట ఏసీపీ డేవిడ్రాజ్, టాస్క్ఫోర్స్ సీఐ దేవేందర్, కమలాపూర్ సీఐ సంజీవ్, ఎల్కతుర్తి ఎస్సై రాజ్కుమార్, టాస్క్ఫోర్స్ ఎస్సై శరత్, సిబ్బందిని సీపీ అభినందించారు.
గంజాయిని పట్టుకున్న పోలీసులు
కేసముద్రం: మండల కేంద్రంలో రూ.4 లక్షల విలువైన 16 కిలోల ఎండు గంజాయి పట్టుకున్నట్లు మహబూబాబాద్ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. సోమవారం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఒడిస్సాకు చెందిన రంజితకుమార్ ప్రధాణ్ ఒడిస్సాలో 16 కిలోల ఎండు గంజాయిని కొనుగోల్ చేసి, తెలంగాణకు రైల్లో తీసుకువస్తున్నాడు. ఈ క్రమంలో రైల్లో పోలీసులను చూసిన రంజితకుమార్ ప్రధాణ్ కేసము ద్రం రైల్వేస్టేషన్లో దిగాడు. కేసముద్రంలోని గాంధీ సెంటర్లో పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించగా, అతడిని పట్టుకొని పరిశీలించగా, రెండు బ్యాగు ల్లో 16 కిలోల ఎండుగంజాయిని గుర్తించినట్లు తెలిపారు. పంచనామా చేసి, గంజాయిని స్వాధీనం చేసుకొని అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గం జాయి పట్టుకోవడానికి సహకరించిన ఎస్సై తిరుపతి, పోలీస సిబ్బంది, రైల్వే ఆర్పీఎఫ్ సిబ్బందిని డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రమేశ్ అభినందించారు.