సుబేదారి, మార్చి20 : పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తనిఖీలు ముమ్మరమయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో మాడల్ కోడ్ను పకడ్బందీగా అమలు చేసేందుకు సీపీ అంబర్ కిశోర్ ఝా చర్యలు చేపట్టారు.
ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయకుండా నగదు రవాణాను అరికట్టేందుకు కమిషనరేట్ పరిధిలో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సీపీ సైతం చెక్పోస్టులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు తనిఖీలు రాత్రింబవళ్లు కొనసాగనున్నాయి. ప్రతి చెక్ పోస్ట్ వద్ద బందోబస్తు కోసం కేంద్ర పారా మిలటరీ బలగాలు మోహరించాయి.
లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్ జిల్లా నర్సంపేట అయ్యప్ప గుడి, నల్లబెల్లి మండలం బొల్లోనిపల్లి, ఖానాపూర్ మండలం అశోక్నగర్, వరంగల్ ఎంజీఎం దవాఖాన జంక్షన్, వరంగల్ లేబర్ కాలనీ-జాన్పాక, ఖమ్మం రోడ్డు నాయుడు పెట్రోల్ పంపు, రాయపర్తి డీసీ తండా, చింత నెక్కొండ, గీసుగొండ మండలం కొమ్మాల, హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్, ఎల్కతుర్తి మండలం పెంచికలపేట, ఆత్మకూరు మండలం కటాక్షపూర్, నడికూడ, ములుగురోడ్డు హన్మాన్ జంక్షన్,
హంటర్రోడ్డు సీఎస్ఆర్ గార్డెన్, కాజీపేట డీజిల్కాలనీ, రాంపూర్, జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం జీడికల్, జఫర్గఢ్ మండలం నల్లబండ, రాయపర్తి-కిష్టాపూర్ క్రాస్రోడ్డు, జనగామ సమీపంలోని పెంబర్తి, తరిగొప్పుల మండలం ఈన్యానాయక్ తండా, బచ్చన్నపేట మండలం కొన్నె క్రాస్ రోడ్డు వద్ద చెక్పోస్టులు నెలకొల్పారు. ప్రతి చెక్ పోస్ట్ వద్ద స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు ఉంటాయి. సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు, స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు ఉంటారు. తనిఖీలను వీడియో రికార్డు చేస్తారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.50వేలపైన నగదు గానీ, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువులు గానీ ఉంటే సీజ్ చేస్తారు. నగదు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే వదిలిపెడతారు. పట్టుబడ్డ నగదును సీజ్ చేసి జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పకడ్బందీగా మాడల్ కోడ్ అమలు చేస్తున్నాం. కమిషనరేట్ పరిధిలో 24 చెక్పోస్ట్లు ఏర్పాటు చేశాం. ఈ నెల 16నుంచి స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నాయి. రూ.50వేల లోపు మాత్రమే నగదు తీసుకెళ్లేందు కు అనుమతి ఉంది. దానికి కూడా ఆధారాలు చూపించాలి. రూ.50వేల కు పైన నగదును ఎలాంటి ఆధారాలు లేకుండా కలిగి ఉంటే సీజ్ చేసి జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అందిస్తాం.
-అంబర్ కిశోర్ ఝా, వరంగల్ పోలీస్ కమిషనర్