‘చిడా-దహి’ వేడుక 23న
ప్రపంచ ప్రసిద్ధమైన ‘దండన’ మహోత్సవాన్ని ‘బ్రహ్మ-మధ్వ-గౌడీయ’ సంప్రదాయవాదులంతా ఏడాది కొకసారి కన్నుల పండువగా జరుపుకొంటారు. ‘హరే కృష్ణ’ ఉద్యమంలో భాగంగానూ దీనిని నిర్వహిస్తారు. ‘దండన’ అంటే అపరాధికి వేసే ‘శిక్ష’. వివరాల్లోకి వెళితే మూలం తెలుస్తుంది.
ఈఉత్సవం మొట్టమొదటిసారిగా 500 సంవత్సరాల క్రితం (క్రీ.శ. 1516) పశ్చిమ బెంగాల్లోని ‘పానిహటి’ అనే ప్రదేశంలో ‘శ్రీ చైతన్య మహాప్రభువుల’ కాలంలో జరిగింది. భక్తులకు ‘అటుకులు (చిడా), పెరుగు (దహీ)తో చేసిన మధుర పదార్థాల’ను అందించడమే ఇందులోని ప్రత్యేకత. ‘షడ్గోస్వాములు’ (ఆరుగురు గోస్వాములు)గా పిలువబడే వారిలో ఒకరైన శ్రీల రఘునాథదాస గోస్వాములవారే ఈ ఉత్సవానికి మూలకారకులు.
అత్యంత సంపన్నులైన జమిందారు కుటుంబానికి చెందిన రఘునాథ దాసులవారికి చిన్ననాటినుండే శ్రీచైతన్య మహాప్రభువులన్నా, శ్రీకృష్ణుడన్నా అమితమైన భక్తి. గొప్ప సంపదలను కలిగివున్నా వాటిపై ఆసక్తి వుండేది కాదు. చిన్నతనంలో వారు ఒకసారి నామాచార్యులైన శ్రీ హరిదాస ఠాకూర మహాశయులను కలుసుకున్నారు. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభువులవారు సన్న్యాసాశ్రమం స్వీకరించిన పిదప శాంతిపూర్ గ్రామానికి విచ్చేసినపుడు, రఘునాథ దాసులు వారిని దర్శించారు. ఆ క్షణమే తన సర్వస్వాన్నీ మహాప్రభువుల సేవకే అంకితం చేశారు. జగన్నాథపురిలో మహాప్రభువును ఆశ్రయించేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు.
ముందుగా శ్రీ నిత్యానంద ప్రభువును ఆశ్రయిస్తే మహాప్రభువును చేరే మార్గం సుగమమవుతుందని తలచారు. గౌడీయ పరంపరలో శ్రీ నిత్యానంద ప్రభువులవారు ఆదిగురు తత్త్వానికి నిదర్శనం. కొన్నాళ్ళకు ‘పానిహటి’లో రఘునాథ దాసులవారు శ్రీ నిత్యానంద ప్రభువులవారిని దూరం నుంచే దర్శించారు. అది చూసిన నిత్యానందులవారు రఘునాథ దాసులను మందలిస్తూ, ‘దొంగలా దూరంగా దాక్కున్న నీకు దండన విధిస్తున్నాను. ఇక్కడి భక్తులందరికీ వెంటనే అటుకులు, పెరుగుతో తయారుచేసిన మధుర పదార్థాలను అందించు’మన్నారు.
దాంతో ఎంతో సంతోషించిన రఘునాథులవారు రుచికరమైన ‘చిడా-దహి’ వంటకాలతో మహా ఉత్సవాన్నే నిర్వహించారు. ఇది తన భక్తునికి భగవంతుడు వేసిన తీపి ‘దండన’. ఆ భక్తిభావానికి అత్యంత ప్రసన్నుడైన శ్రీ నిత్యానంద ప్రభువుల కృపచే, ఆ తర్వాతి కాలంలో రఘునాథుడు శ్రీ చైతన్య మహాప్రభువుల సంకీర్తనోద్యమ ప్రచారంలో ప్రథములై గోస్వామి స్థాయిని చేరారు. ఆనాటి ఆ తీపి ‘దండన’కు గుర్తుగా ఈ వేడుక ‘చిడా-దహి’ మహోత్సవంగా ప్రతి ఏటా నిర్వహించబడుతున్నది. హరే కృష్ణ.
భక్తులకు ‘అటుకులు (చిడా), పెరుగు (దహీ)తో చేసిన మధుర పదార్థాల’ను అందించడమే ఇందులోని ప్రత్యేకత. ‘షడ్గోస్వాములు’ (ఆరుగురు గోస్వాములు)గా పిలువబడే వారిలో ఒకరైన శ్రీల రఘునాథదాస గోస్వాములవారే ఈ ఉత్సవానికి మూలకారకులు.
భక్తిభావానికి అత్యంత ప్రసన్నుడైన శ్రీ నిత్యానంద ప్రభువుల కృపచే, ఆ తర్వాతి కాలంలో రఘునాథుడు శ్రీ చైతన్య మహాప్రభువుల సంకీర్తనోద్యమ ప్రచారంలో ప్రథములై గోస్వామి స్థాయిని చేరారు.
శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984