మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే హాజరత్ సయ్యద్షా అప్జల్ బియాబానీ 187వ దర్గా ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతాయని పీఠాధిపతి ఖుస్రూపాషా తెలిపారు. మంగళవారం దర్గా కాజీపేటలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉత్సవాలు బుధవారం మొదలై శుక్రవారం వరకు జరుగుతాయన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వపరంగా అన్ని సౌకర్యాలు కల్పించారని చెప్పారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
రైళ్ల ద్వారా వచ్చే భక్తులకు కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సులు, హైదరాబాద్, ఉప్పల్ పాయింట్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తులకు ఫాతిమానగర్లో ప్రత్యేక బస్స్టాప్ ఏర్పాటు చేయించామన్నారు. భక్తులకు దర్గా పీఠం ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నామన్నారు. మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆదేశానుసారం అన్ని మౌలిక వసతులు, ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో యువ పీఠాధిపతి(పీఠాధిపతి కుమారుడు) భక్తియార్ బియాబానీ, మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా, అదనపు కమిషనర్, నోడల్ అధికారి ఏ రషీద్, ఆర్డీవో రమేశ్, తహసీల్దార్ భావ్సింగ్, కాజీపేట ఏసీపీ డేవిడ్రాజ్, సీఐ సార్ల రాజు, డిప్యూటీ మేయర్ రిజ్వానా మసూద్, మత పెద్దలు సిరాజుద్దీన్, షాన్వాజ్ పాల్గొన్నారు.
బుధవారం రాత్రి సందల్
తొలిరోజు బుధవారం రాత్రి 11గంటలకు సందల్(గంధలేపనం) బఢాఘర్ నుంచి ఊరేగింపుగా బియాబానీ దర్గాకు అర్ధరాత్రి తర్వాత తీసుకొస్తారు. మత పెద్దలు సమాధికి గంధలేపనం చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో ఉత్సవాలు ప్రారంభమైనట్లు పీఠాధిపతి ప్రకటిస్తారని తెలిపారు.
గురువారం ఉర్సు ఉత్సవాలు
రెండో రోజు గురువారం మధ్యాహ్నం దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా, కుమారుడు యువ పీఠాధిపతి సయ్యద్ భక్తియార్ బియాబానీ ప్రత్యేక ప్రార్థనలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాథిపతులు ప్రత్యేక ప్రార్థనలు, మతపెద్దలు సమాధికి చాదర్-ఎ-గుల్ (పుష్పదుప్పటి) కప్పి ప్రార్థనలు చేస్తారు. సాయంత్రం 6 గంటలకు ప్రార్థనలు ఉంటాయి.
శుక్రవారం ముగింపు
ఉదయం పీఠాధిపతి ఖుస్రూపాషా ప్రత్యేక ప్రార్థనలు, ఫకీర్ల విన్యాసాలు, ఖురాన్ పఠనం అనంతరం ఉత్సవాల ముగుస్తాయని తెలిపారు.