జిల్లా వ్యాప్తంగా దసరా సంబురాలు అంబరాన్నంటాయి. నగరంలోని ఉర్సు రంగలీలా మైదానం, కాశీబుగ్గ చిన్న వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో నిర్వహించిన రామ్లీలా అలరించింది. ప్రధానంగా రంగలీల మైదానంలో తొలిసారి ఏర్పాటు చేసిన లేజర్ షో అమితంగా ఆకట్టుకున్నది. వర్షంలోనూ జనం పోటెత్తగా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రావణాసురుడి ప్రతిమకు నిప్పంటించి వేడుకను ప్రారంభించారు. ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి, సీపీ తరుణ్జోషి, కలెక్టర్ గోపి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, పలువురు కార్పొరేటర్లు హాజరయ్యారు.
నమస్తే నెట్వర్క్, అక్టోబర్ 6 : దసరా సందర్భంగా బుధవారం రాత్రి రామ్లీలా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కొద్ది సేపు వర్షం ఆటంకం కలిగించినా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. ఆయాచోట్ల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆకాశంలో తారాజువ్వలు మిరుమిట్లు గొలిపాయి. తరలివచ్చిన అశేష భక్తజనంతో రామ్లీలా ప్రాంతాలు జాతరలను తలపించాయి. వరంగల్లోని ఉర్సు రంగలీలా మైదానంలో వేడుకలు అంబరాన్నంటాయి. వర్షం తగ్గిన కొద్ది సమయంలోనే మైదానం ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఆటాపాట అలరించగా, తారాజువ్వలు హరివిల్లును తలపింపజేశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో చూపరుల ను విశేషంగా ఆకట్టుకుంది.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, సీపీ తరుణ్జోషి, కలెక్టర్ గోపి, కుడా చైర్మన్ సుందర్రాజ్ తదితరులు వేడుకలను తిలకించారు. హనుమకొండ పద్మాక్షి కాలనీలో ఏర్పాటు చేసిన రామ్లీలా కార్యక్రమానికి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకొని పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. రంగశాయిపేటలోని మహంకాళి గుడి ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి మేయర్ సుధారాణి హాజరయ్యారు. పటాకుల మెరుపులతో ఆ ప్రాంతమంతా శోభాయమానంగా మారింది. నృత్యాలతో కళాకారులు, విద్యార్థులు అదరగొట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటాపాటలు ఆకట్టుకున్నాయి. పటాకుల మోతతో రామ్లీలా కార్యక్రమం దద్దరిల్లింది. మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో నిర్వహించిన వేడుకలకు జనం వేలాదిగా తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, డీసీపీ సీతారాం హాజరయ్యారు. ములుగులో ధర్మజాగరణ్ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఎస్పీ సుధీర్రామ్నాథ్ కేకన్, ఓఎస్డీ గౌస్ఆలం, జడ్పీటీసీ సకినాల భవాని పాల్గొన్నారు. మహబూబాబాద్లోని హనుమంతుడి గడ్డలో జరిగిన కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చారు.