హనుమకొండ సిటీ, ఆగస్టు 27: పోలీసులు ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి పోలీస్ కమిషనరేట్ అధికారులకు సూచించారు. వరంగల్ కమిషనరేట్ అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరాలపై సమీక్షించారు. అంతకు ముందు నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడొద్దని సూచించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ప్రతి కాలనీలో ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. నేరం చేసే వాడికి శిక్ష, నేరం చేయని వారికి రక్షణ కల్పించడమే పోలీస్ శాఖ లక్ష్యంగా పనిచేయాలన్నారు. మహిళల భద్రతకు మరింత భరోసా కల్పించడంతో పాటు సత్వర సేవలందించాలన్నారు. ‘పోక్సో’ కేసుల్లో విచారణను వేగవంతం చేయాలన్నారు. పెండింగ్ కేసులను తగ్గించడంలో ప్రతిభ చూపిన ఈస్ట్జోన్ బృందాన్ని, డీసీపీ వెంకటలక్ష్మిని సీపీ అభినందించారు. సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి, వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్రెడ్డి, ఈస్ట్ జోన్ డీసీపీ కొల్లి వెంకటలక్ష్మి, సెంట్రల్ జోన్ డీసీపీ కే పుష్ప, స్టేషన్ఘన్పూర్ ఏఎస్పీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.