గీసుగొండ/సంగెం, ఆగస్టు 27: అన్ని పాఠశాలల్లో పరిశుభ్రత పాటిస్తూ గదులను ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ సూచించారు. మండలంలోని వంచనగిరి మాడల్స్కూల్ను శుక్రవారం ఆయన పరిశీలించారు. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించినందున కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఉపాధ్యాయులు, విద్యార్థులు స్కూళ్లకు హాజరు కావాలని సూచించారు. పిల్లలు, టీచర్లు శానిటైజర్లను వెంట తెచ్చుకుని తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. మాస్కులు ధరించి హాజరు కావాలన్నారు. తరగతి గదుల్లో విద్యార్థులు భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట ఎంపీపీ భీమగాని సౌజన్య, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో ప్రవీణ్కుమార్, ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు ఉన్నారు. అలాగే, అదనపు కలెక్టర్ సంగెం మండలంలోని కాపులకనపర్తి జడ్పీఎస్ఎస్ను తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణతోపాటు తరగతి గదుల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. తరగతి గదుల్లో పెచ్చులు ఊడుతుండడాన్ని గమనించిన ఆయన స్లాబ్కు ఎస్టిమేషన్ వేయాలని హెచ్ఎం వెంకన్నను ఆదేశించారు. అలాగే, తరగతి గదులకు రంగులు వేయించాలన్నారు.
బడులను సిద్ధం చేయాలి
ఖానాపురం/నర్సంపేటరూరల్/ఖిలావరంగల్/నర్సంపేట/నెక్కొండ/దుగ్గొండి/పర్వతగిరి/కాశిబుగ: పునఃప్రారంభానికి ముందే అన్ని పాఠశాలలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు అన్నారు. మండలంలోని కొత్తూరు, రాగంపేట, రంగాపురంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఎంపీడీవో సుమనావాణితో కలిసి ఎంపీపీ పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పిచ్చిమొక్కలు లేకుండా చూడాలన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండొద్దన్నారు. వారి వెంట సర్పంచ్లు ఐలయ్య, నరేశ్, ఉపాధ్యాయులు, జీపీ సిబ్బంది ఉన్నారు. నర్సంపేట మండలంలోని రాజుపేట, ముత్తోజిపేట, ఆకులతండా, ఇటుకాలపల్లిలోని ప్రభుత్వ పాఠశాలల్లో జీపీ సిబ్బంది పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఎంపీడీవో అజ్మీరా నాగేశ్వరరావు ఆయా పాఠశాలల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్లు దస్రూ, శ్రీనివాస్రెడ్డి, రవీందర్, రాము ఉన్నారు. ఖిలావరంగల్ పరిధి శివనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జీడబ్ల్యూఎంసీ కార్మికులు పారిశుధ్య పనులు చేశారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, పరిసరాల్లో రసాయనాలను పిచికారీ చేశారు. నర్సంపేట పట్టణంలోని అన్ని పాఠశాలలను మున్సిపల్ సిబ్బందితో విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు సిద్ధం చేయిస్తున్నారు. ఈ సందర్భంగా శానిటేషన్ పనులు చేపట్టారు. నెక్కొండ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. అలంకానిపేట జడ్పీఎస్ఎస్లో సర్పంచ్ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఆవరణలో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించారు.
దుగ్గొండితో పాటు నాచినపల్లి, పొనకల్ ప్రభుత్వ పాఠశాలలను ఎంపీడీవో కృష్ణప్రసాద్ సందర్శించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాబోధన చేయాలన్నారు. ఆయన వెంట ఎంపీవో శ్రీధర్గౌడ్, సర్పంచ్లు మమతారాజు, బొమ్మగాని ఉర్మిళావెంకన్న, హెచ్ఎం దుర్గాప్రసాద్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. పర్వతగిరి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని ఎంఈవో చదువుల సత్యనారాయణ సూచించారు. బూర్గుమళ్ల, పర్వతగిరిలోని కేజీబీవీ, మోడల్ స్కూల్ను ఆయన తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో శానిటేషన్ చేయించాలన్నారు. వరంగల్ కాశిబుగ్గ పరిధి 20వ డివిజన్ నరేంద్రనగర్ హైస్కూల్లో స్థానిక కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది శానిటేషన్ పనులు నిర్వహించారు. హెచ్ఎం రవికుమార్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ధరమ్సింగ్, డివిజన్ అధ్యక్షుడు ఇక్బాల్, పెండ్యాల సోనిబాబు పాల్గొన్నారు.