పోచమ్మమైదాన్, ఆగస్టు 8: శ్రావణమాసాన్ని అందరూ పవి త్రంగా భావిస్తారు. ఈ మాసంలో కనీసం ముప్పయి వ్రతాలు చేయాలని పురాణాల్లో ఉంది. ప్రతి వ్రతంలోనూ మనిషి జీవన ప్రమాణాలు, ఆయురారోగ్యాలను పెంచే శాస్త్రీయత ఉంది. ఇదే క్రమంలో శ్రావణ శుద్ధ దశమిరోజు శివలింగాన్ని పాలతో అభిషేకిస్తే ధనహాని ఉండదని, శుద్ధ ఏకాదశి రోజు లక్ష్మీనారాయణుడిని పంచామృతాలతో అభిషేకిస్తే దీర్ఘాయుష్షు కలుగుతుందని ప్రతీతి. శ్రావణ మాసం నేటి నుంచి సెప్టెంబర్ 7 వరకు ఉంటుండగా, ఐదు సోమవారాలు వస్తుండడం ప్రత్యేకతగా నిలుస్తోంది.
బోనాలు.. పండుగలకు ప్రత్యేకత..
శ్రావణ మాసంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటారు. అలాగే ఈ నెలలో వచ్చే నాగ పంచమి రోజు సర్వదోషాలు తొలగిపోవాలంటూ నాగేంద్రుడికి పూజలు చేస్తారు. అన్నాచెల్లెళ్ల అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి కూడా ఈ మాసంలోనే వస్తుంది. వరలక్ష్మీ, మంగళ గౌరీ వ్రతం, వరాహ జయంతి, కృష్ణాష్టమి పండుగలు సైతం శ్రావణమాసంలో రావడం పవిత్రంగా భావిస్తారు. సోమ, శనివారాల్లో ఉపవాసాలు ఉంటారు. శ్రావణమాసం వచ్చిదంటే పెళ్లిళ్ల సీజన్ ఆరంభమవుతుంది. ఈ నెల 11 నుంచి సెప్టెంబర్ వరకు పెళ్లిళ్ల ముహూర్తాలు ఉన్నాయని వరంగల్లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ అర్చకుడు బ్రాహ్మణపల్లి ఆంజనేయశాస్త్రి తెలిపారు.
నెలకొననున్న భక్తుల సందడి
శ్రావణమాసం వచ్చిందంటే ఆలయాల్లో భక్తుల సందడి నెలకొననుంది. దాదాపు వారంలో ప్రతి రోజూ ఏదో ఒక ప్రాముఖ్యత కలిగి ఉండడంతో ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ముఖ్యంగా సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారంతోపాటు అమావాస్య, అష్టమి రోజుల్లో కూడా విశేషంగా భావిస్తారు. సోమవారం పరమశివుడికి ప్రత్యేక అభిషేకాలు, మంగళవారం మంగళగౌరీ వ్రతం, శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, శనివారం కలియుగ వేంకటేశ్వరుడికి విశేష పూజలు చేస్తూ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. వీటితోపాటు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.