సంగెం/గీసుకొండ/రాయపర్తి/నర్సంపేట రూరల్/చెన్నారావుపేట/పోచమ్మమైదాన్, నవంబర్ 12: మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను డీఈవో వాసంతి శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎన్ఏఎస్) పరీక్ష కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. మండలంలో 126 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మండల కేంద్రంలోని కేజీబీవీ, గవిచర్ల మోడల్స్కూల్, కాపులకనపర్తి జడ్పీ పాఠశాల, రవిచంద్ర, విద్యాభారతి, శ్రీరత్న పాఠశాలలో విద్యార్థులు పరీక్ష రాశారు. గీసుకొండ మండలం ధర్మారం, గంగదేవిపల్లిలోని పాఠశాలలను డీఈవో వాసంతి సందర్శించి, పరీక్షా విధివిధానాలను పరిశీలించారు. రాయపర్తి మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను డీసీఈబీ కార్యదర్శి గారె కృష్ణమూర్తి తనిఖీ చేశారు. మండలకేంద్రంలోని లహరి పబ్లిక్ స్కూల్, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలతోపాటు కొండూరు, కొలన్పల్లి, కాట్రపల్లి, మొరిపిరాలలోని జడ్పీఎస్ఎస్లు, పీఎస్లు, ఎంపీఎస్లను ఆయన తనిఖీ చేశారు. ఎన్ఏఎస్ పరీక్షలను పర్యవేక్షించి సూచనలు చేశారు. మొరిపిరాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. నర్సంపేట మండలవ్యాప్తంగా జాతీయ సాధన సర్వే పరీక్ష పగడ్బందీగా జరిగినట్లు ఎంఈవో రత్నమాల తెలిపారు. చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ మోడల్ స్కూల్, చెన్నారావుపేట సిద్ధార్థ మోడల్ హైస్కూల్, తిమ్మరాయినీపహాడ్లోని సెయింట్ థెరిస్సా పాఠశాల, పాపయ్యపేటలోని గుడ్షెపర్డ్ పాఠశాల, లింగాపురంలోని జడ్పీఎస్ఎస్, తోపనగడ్డతండా ప్రాథమిక పాఠశాలలో ‘న్యాస్’ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి ఉండ్రాతి సుజన్తేజ పరిశీలించారు. వరంగల్ దేశాయిపేటలోని ప్రభుత్వ సహాయక నెహ్రూ మెమోరియల్ స్కూల్, లోటస్ స్కూల్, కృష్ణవేణి, ఎల్బీనగర్లోని ఎంజే రోడ్డు స్కూల్, ఆటోనగర్లోని ప్రభుత్వ పాఠశాల, గిర్మాజీపేట, ఇస్లామియా తదితర పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిపారు.