నమస్తే నెట్వర్క్: కరీమాబాద్ ప్రాంతంలోని ఉర్సు రంగసముద్రం చెరువు, బెస్తం చెరువులో ఆదివారం గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. డప్పుచప్పుళ్ల మధ్య యువత, మహిళలు నృత్యాలు చేస్తూ ఏకదంతుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు. స్థానిక కార్పొరేటర్ మరుపల్ల రవి పరిస్థితులను గమనించారు. ఉర్సు చెరువు వద్ద మిల్స్కాలనీ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. మామునూరు సీఐ రమేశ్ పర్యవేక్షించారు. వరంగల్ మహానగరపాలక సంస్థ, నీటిపారుదల, దేవాదాయ, రెవెన్యూ, ఆరోగ్య, విద్యుత్, అగ్నిమాపక శాఖల సిబ్బంది విధులు నిర్వర్తించారు. ఉర్సు చెరువును కలెక్టర్ గోపి, మేయర్ గుంగు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య, వరంగల్ ఏసీపీ గిరికుమార్ పరిశీలించారు. దేశాయిపేటలోని చిన్న వడ్డేపల్లి చెరువు, ఆటోనగర్ రోడ్డులోని కోట చెరువును అడిషనల్ కలెక్టర్ బీ హరిసింగ్ పరిశీలించారు. గీసుగొండ మండల పరిధి గ్రేటర్ 16వ డివిజన్ కట్టమల్లన్న చెరువు వద్ద ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ హరిసింగ్ పరిశీలించారు. తాసిల్దార్ సుహాసిని, ఎంపీవో రమేశ్, సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై పెండ్యాల దేవేందర్, ఆర్ఐ అర్జున్ తగిన చర్యలు చేపట్టారు. 15వ డివిజన్లోని కట్టమల్లన్న చెరువులో 15, 16వ డివిజన్లతోపాటు వరంగల్ నుంచి భారీ వినాయకులను భక్తులు తీసుకొచ్చి నిమజ్జనం చేశారు. కార్పొరేటర్ సుంకరి మనీషా, ఆర్ఐ అర్జున్ పాల్గొన్నారు.
కనుల పండువగా నిమజ్జనం
వర్ధన్నపేట పట్టణంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో నిమజ్జన వేడుకలు కనులపండువగా జరిగాయి. ఇల్లందలో ముస్లిం దంపతులు వినాయకుడికి 9 రోజులపాటు పూజలందించి చెరువులో నిమజ్జనం చేశారు. చెన్నారావుపేటలోని ఆదర్శనగర్కాలనీ, అమీనాబాద్, పాపయ్యపేటలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, సొసైటీ చైర్మన్ మురహరి రవి, గ్రామ అధ్యక్షుడు బుర్ర సుదర్శన్గౌడ్ పాల్గొన్నారు. ఎస్సై శీలం రవి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నల్లబెల్లి మండలంలో నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి ఘటనలు జరుగకుండా ఎస్సై బండారు వెంకటేశ్వర్లు గట్టి బందోబస్తు చేపట్టారు. పర్వతగిరి మండలంలో సీఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో చెరువుల బందోబస్తు చేపట్టారు. వినాయక విగ్రహాలు ఊరేగింపుగా వెళ్తుంటే మహిళలు ఎదురేగి పూజలు చేశారు. దుగ్గొండి మండలంలోని 34 గ్రామాల్లో భక్తుల నృత్యాలు, కోలాటాల మధ్య నిమజ్జన వేడుకలు జరిగాయి. దుగ్గొండి రూరల్ సీఐ సతీశ్బాబు, ఎస్సై నవీన్కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చేపట్టారు. రేఖంపల్లిలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎస్సై నవీన్కుమార్ పాల్గొని పూజలు చేశారు. ఖానాపురం మండలంలో యువత జైబోలో గణేశ్ మహారాజ్కీ.. అంటూ ఆటపాటలతో గణనాథులను పురవీధుల్లో ఊరేగించి నర్సంపేట శివారులోని దామెర చెరువులో నిమజ్జనం చేశారు.
ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామినాయక్, ఎంపీపీ ప్రకాశ్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటనర్సయ్య పాల్గొన్నారు. పోచమ్మమైదాన్ పరిధిలోని వడ్డేపల్లి చెరువును మేయర్ గుండు సుధారాణి కార్పొరేటర్ సురేశ్కుమార్జోషి, ఏఈ రంజిత్, ఎస్సై ధరమ్సింగ్, నాయకులు లక్ష్మణ్, వెంకటేశ్వర్లు, జాన్, బాలకిషన్, భరత్, హరినారాయణ, మల్లికార్జున్తో కలిసి పరిశీలించారు. నర్సంపేట పట్టణంలోని 24 వార్డుల్లో ఏర్పాటు చేసిన గణనాథులను దామెర చెరువులో నిమజ్జనం చేశారు. నర్సంపేట ఏసీపీలు ఫణీందర్, కరుణసాగర్రెడ్డి, ఎస్సైలు పర్యవేక్షించారు. వల్లభ్నగర్లో లడ్డూను వేలంలో కుక్కమూడి శ్రావణి, సురేశ్ రూ. 5016కు దక్కించుకున్నారు. రాయపర్తి మండలంలో కుల, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఉత్సవ కమిటీల నేతృత్వంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను స్థానిక జలాశయాల్లో నిమజ్జనం చేశారు. రాయపర్తిలోని మంచినీళ్ల చెరువు వద్ద సర్పంచ్ గారె నర్సయ్య నేతృత్వంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. నర్సంపేట మండలవ్యాప్తంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను భక్తులు వర్షంలోనూ ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. నర్సంపేట పట్టణంలోని సర్వాపురం శివారు దామెర చెరువు వద్ద ఏర్పాట్లను రూరల్ సీఐ సతీశ్బాబు, తాసిల్దార్ వాసం రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, ఎస్సైలు పరిశీలించారు.
అశేష భక్తుల నడుమ..
ఖిలావరంగల్లో బొజ్జ గణపయ్యకు అడుగడుగునా మంగళ నీరాజనాలు పలుకుతూ అశేష భక్తజనావలి భజనలు, కోలాటాలు, డప్పు నృత్యాలతో విఘ్నేశ్వరస్వామి శోభాయాత్రలో ముందుకు సాగింది. రాత్రి పొద్దుపోయే వరకూ చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఓరుగల్లు కోటతోపాటు శివనగర్, పుప్పాలగుట్ట, శంభునిపేట, బొల్లికుంట, గాడిపెల్లి, దూపకుంట, వసంతపురం, స్తంభంపల్లి, ఆదర్శనగర్, చింతల్లో గణపతి ఉత్సవ కమిటీలు, మండళ్లు శోభాయాత్రను నిర్వహించాయి. ఖిలావరంగల్ తాసిల్దార్ మంజుల కోట చెరువును పర్యవేక్షించారు.