కరీమాబాద్, జనవరి 5 : సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్లోకి చేరుతున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు క్రాంతికుమార్ ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారినప్పటి నుంచి బీజేపీ నుంచి చేరికలు పెరిగాయన్నారు. దేశంలో బీజేపీకి బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయమన్నారు. ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారని తెలిపారు. పార్టీని నమ్ముకుని వచ్చిన వారికి అండగా ఉంటామన్నారు. సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రజల కోసం చేస్తున్న పనులను క్షేత్రస్థాయిలో వివరించాలన్నారు. కూచన క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్రంలో అవలంబిస్తున్న విధానాలు నచ్చకనే బీఆర్ఎస్లో చేరానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చింతాకుల అనిల్, బాలిని సురేశ్, జడ్ఆర్సీ మెంబర్ చింతాకుల సునీల్ పాల్గొన్నారు.
వరంగల్ చౌరస్తా : స్వరాష్ట్రం ఏర్పాటైన తర్వాతే తెలంగాణలో రోడ్డు రవాణా సంస్థ సేవలు విస్తృతమయ్యాయని, ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం తెలంగాణ ప్రభుత్వం అందజేసిన నూతన బస్సులను వరంగల్ బస్టాండ్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ నుంచి హైదరాబాద్కు ఆధునిక సూపర్ లగ్జరీ సర్వీసులు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. వరంగల్లో రూ.75కోట్ల వ్యయంతో 32 ప్లాట్ఫాంలు, ఐదు అంతస్తులతో దేశంలోనే మొదటి మోడల్ బస్టాండ్గా రూపొందించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు.
కాగా, వరంగల్ బస్టాండ్ను తాత్కాలికంగా అజాంజాహి మిల్స్ గ్రౌండ్కు తరలించడానికి చర్యలు చేపడుతున్నామని, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బస్స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాల్లో రూ.3,800 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వరంగల్ నగరాన్ని హెల్త్ హబ్గా మార్చనున్న నేపథ్యంలో సెంట్రల్ జైలు స్థలంలో రూ. 1100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత, డిప్యూటీ ఆర్ఎం కృపాకర్రెడ్డి, డీఎం సురేశ్, స్టేషన్ కంట్రోలర్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గిర్మాజీపేట : వరంగల్ సిటీ ఆర్ఎంపీ, పీఎంపీల బృందం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ను క్యాంప్ కార్యాలయంలో మార్యదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానన హామీ ఇచ్చారు. అలాగే దుర్గేశ్వరస్వామి దేవస్థానంలో బీఆర్ఎస్ నాయకుడు, కుడా డైరెక్టర్ మోడెం ప్రవీణ్ అయ్యప్ప ఇరుముడి కార్యక్రమంలోఎమ్మెల్యే పాల్గొన్నారు. క్యాంప్ కార్యాలయంలో నవ తెలంగాణ దివ్యాంగుల ఫోరం ఎంప్లాయీస్ యూనియన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు.
కరీమాబాద్ : ప్రభుత్వ విద్యాలయాలను స్థానికంగా ఏర్పాటు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు. నియోజకవర్గానికి చెందిన మహాత్మా జ్యోతిరావు ఫూలే పాఠశాల, ఇంటర్ కళాశాల ఇతర ప్రాంతాల్లో ఉండగా వాటిని ఇక్కడికి తరలించేందుకు ఉర్సు బైపాస్ రోడ్డులోని భవనాన్ని పరిశీలించారు. త్వరలోనే విద్యాలయాలను ఇక్కడకు తరలించేలా చర్యలు చేపడుతామన్నారు.