కేసముద్రం ఆగస్టు 26 : మూస పద్ధతిలో కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తూ ఆర్థికంగా బలోపేతం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిసున్న తరుణంలో రైతులు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. మేలైన విత్తనాలు ఎంచుకుని అధిక దిగుబడులు సాధిస్తూ లాభాల బాట పడుతున్నారు. ఈ క్రమంలో ‘కదిరి లేపాక్షి-1812’ రకం పల్లి రైతులకు కాసులు కురిపిస్తున్నది. సాధారణ రకాలు ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుండగా కదిరి రకంతో ఎకరాకు 20 క్వింటాళ్లకు పైనే దిగుబడి వస్తున్నది.
విత్తనాల ఎంపిక ముఖ్యం..
పంటల సాగులో విత్తనాల ఎంపిక చాలా ముఖ్యమైంది. ప్రత్యామ్నాయ పంటల సాగుకోసం మేలైన విత్తనాలు ఎంచుకుంటే మార్కెట్లో అధిక ధర పొందే అవకాశం ఉంటుంది. తక్కువ నీరు, తక్కువ కాలంలో సాగవడంతో పాటు కేసముద్రంలో ఆయిల్ మిల్లులు, ప్రత్యేకంగా పల్లి నూనె మిల్లులు ఉండడంతో ఇక్కడి రైతులు గతంలో ఎక్కువగా పల్లి సాగుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. వాతావరణ పరిస్థితుల మూలంగా దిగుబడి సరిగా రాక మధ్యలో కొన్నేళ్లపాటు పల్లి సాగును తగ్గించారు. అందరూ వరి పండిస్తే లాభాలు ఉండవని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నది. ఈ క్రమంలో అధిక దిగుబడి వచ్చే పల్లి విత్తనాలు అందుబాటులోకి వచ్చాయని తెలిసి మండలంలోని కొత్తూర్కు చెందిన రైతు సారంపల్లి కరుణాకర్రెడ్డి కదిరి లేపాక్షి రకం విత్తనాలను అనంతపురం జిల్లా నుంచి గతేడాది డిసెంబర్లో తీసుకొచ్చాడు.
సాధారణం 65కిలోలు.. కదిరి 35కిలోలే
ఎకరాకు సాధారణ రకాలైతే 65 కిలోల విత్తనాలు కావాల్సి ఉంటుంది. కదిరి రకం 35కిలోలే సరిపోతాయి. ఇవి కిలోకు రూ.140 చొప్పున సదరు రైతు అనంతపురం నుంచి తెప్పించాడు. సాధారణ పల్లి రకం మొక్కకు 5 నుంచి 10 కొమ్మలు వస్తే కదిరి రకానికి 30కి పైగా కొమ్మలు వచ్చి మర్రి చెట్టు ఊడల మాదిరిగా భూమిలోకి పోయి కాయలు అధికంగా కాస్తున్నాయని రైతు కరుణాకర్రెడ్డి తెలిపాడు. ఎకరాకు 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి సాధించడంతో కరుణాకర్రెడ్డి వద్ద కేసముద్రం మండల రైతులతోపాటు నర్సంపేట, డోర్నకల్, గూడూరు, నెల్లికుదురు, పర్వతగిరి మండలాల రైతులు విత్తనాలు తీసుకెళ్లారు. కదిరి రకాన్ని కల్వల గ్రామానికి చెందిన మర్యాద శ్రీను మేలో 30 గుంటల భూమిలో సాగు చేయగా పంట చేతికి వచ్చింది. ఒక్కో చెట్టుకు సుమారు 150 నుంచి 200వరకు కాయలు ఉండగా 15 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చిందని శ్రీను తెలిపాడు. చెట్టు భారీగా పెరుగడంతో పశువుల మేతకు సైతం ఉయోగపడుతుంది. మార్కెట్లో క్వింటాలు పల్లి రూ.4 వేల నుంచి రూ.5వేలు ధర పలుకుతున్నది. సాధారణ రకం పంట కాలం 100 రోజలు కాగా, కదిరి రకం 120రోజుల్లో చేతికి వస్తుంది.
నాలుగెకరాల్లో సాగు చేశా..
పసుపు, వరికి ప్రత్యామ్నాయంగా అధిక దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలనే ఆలోచనతో యూట్యూబ్లో పరిశీలిస్తుండగా అనంతపురం జిల్లాలో అధిక దిగుబడి వచ్చే కదిరి లేపాక్షి రకం పల్లి విత్తనాలను తయారు చేశారని తెలుసుకున్నాను. గత డిసెంబర్లో అక్కడికి వెళ్లి కేజీకి రూ.140 చొప్పున తీసుకొచ్చి సాగు చేశా. ఎకరానికి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి రావడంతో ఇతర రైతులు కూడా నా వద్ద నుంచి విత్తనాల కోసం తీసుకెళ్లారు. గతేడాది మంచి లాభాలు రావడంతో జూన్లో నాలుగెకరాల్లో కదిరి రకం పల్లి పంట వేశా. – కరుణాకర్రెడ్డి, రైతు