ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం కురిసింది. వరంగల్ నగరంలో 10.62 సెంటీమీటర్ల వర్షం కురవగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సంతోషిమాతకాలనీ, కాశీకుంట, వాంబేకాలనీ, మైసయ్యనగర్, డీకేనగర్, ఎన్టీఆర్ నగర్, శివనగర్, హంటర్రోడ్, రామన్నపేట, మండిబజార్, చార్బౌళి, అండర్రైల్వేగేట్ ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించి వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం సమకూర్చారు. ముంపు ప్రాంతాల్లో మేయర్ గుండు సుధారాణి పరిశీలించి నీట మునిగిన కాలనీల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షంతో వడ్డెపల్లి, ఉర్సు చెరువులు మత్తడి పోస్తున్నాయి. హనుమకొండ అంబేద్కర్ జంక్షన్ సమీప మురికికాలువలో అదుపు తప్పి కారు పడిపోగా అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ కలెక్టరేట్లో టోల్ఫ్రీ నెంబర్ 18004251115 ఏర్పాటుచేశారు. కంట్రోల్ రూమ్ 24గంటలు పనిచేసేలా చూడడంతో పాటు అధికారులెవరూ హెడ్క్వార్టర్ వదిలి ఎవరూ వెళ్లవద్దని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు టెలీ కాన్ఫరెన్స్లో ఆదేశించారు. జిల్లాలో వర్షాల పరిస్థితిపై ఆరాతీశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం 17.4 మి.మీ వర్షపాతం నమోదైంది. మహాముత్తారం మండలంలో అత్యధికంగా 48.6 మి.మీ, గణపురంలో అత్యల్పంగా 2 మి.మీ వర్షం కురిసింది. టేకుమట్ల మండలంలోని మానేరు, చలివాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మహాముత్తారం మండలం పోలీస్ట్సేషన్ వాగు ఉధృతంగా పారుతుండగా, వరద ఉధృతిలోనూ రోడ్డు దాటి ఏఎన్ఎంలు విజయ, సంధ్య వైద్య సేవలందించారు. భారీ వర్షం జనగామ పట్టణాన్ని ముంచెత్తింది. జిల్లాకేంద్రంలోని హైదరాబాద్-హనుమకొండ ప్రధాన రహదారి సహా పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. రంగప్పచెరువు మత్తడి పోయడంతో దిగువనున్న కాలనీల్లోకి పెద్దఎత్తున నీరు చేరింది. డ్రైనేజీలు, ప్రధాన నాలాలు పొంగిపొర్లడంతో ఇళ్లలోకి వరద, మురికినీరు చేరి జనం అతలాకుతలమయ్యారు. జనగామ, దేవరుప్పుల, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్, లింగాలఘనపురం, జఫర్గఢ్, బచ్చన్నపేట, రఘునాథపల్లి, చిల్పూరు మండలాల్లో అత్యధికంగా, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చీటకోడూరు రిజర్వాయర్ నిండుకుండలా మారడంతో నాలుగు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. కలెక్టరేట్లో టోల్ఫ్రీ నంబర్ 1800 4251116, 8247847692 ఏర్పాటుచేశారు.