ఖానాపురం, నవంబర్ 5: మండలంలో 2006కు ముందు నుంచి పోడుభూములు సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజన, గిరిజనేతర రైతులు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలకు దరఖాస్తు చేసుకోవాలని నర్సంపేట ఆర్డీవో పవన్కుమార్ సూచించారు. మండలకేంద్రంలోని రైతు వేదిక భవనంలో శుక్రవారం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు అధ్యక్షతన సర్పంచ్లు, ఎంపీటీసీలకు పోడు, అటవీ భూముల పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోడుభూములను సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న గిరిజన, గిరిజనేతర రైతులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. దరఖాస్తు చేసుకుకోవాలంటే గిరిజనులైతే 2005కు ముందు నుంచి, గిరిజనేతరులైతే మూడు తరాల నుంచి పోడు భూములను సాగు చేసుకుంటున్నట్లు ఆధారాలు ఉండాలన్నారు. 10 నుంచి 15 మంది సభ్యులతో కూడిన గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకుని, వారితోనే గ్రామసభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారని వివరించారు.
దరఖాస్తు చేసుకున్న వారికే అవకాశం
ఈ నెల 8వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని వెల్లడించారు. గ్రామసభల్లోనే దరఖాస్తులు అందజేయాలని ఆర్డీవో అన్నారు. లేనిపక్షంలో వారికి అవకాశం ఉండదన్నారు. మండలంలో 15 గ్రామ పంచాయతీల పరిధిలోని 21 గ్రామా ల్లో పోడుభూములు సాగవుతున్నట్లు గుర్తించామన్నారు. ఆయా గ్రామాల రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గ్రామ కమిటీలో తిరస్కరణకు గురైన దరఖాస్తులను 60 రోజుల్లో సబ్ డివిజన స్థాయి కమిటీకి, అక్కడ తిరస్కరించిన దరఖాస్తులను 60 రోజుల్లో జిల్లా కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. జిల్లా కమిటీదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. సమావేశంలో తాసిల్దార్ సుభాషిణి, ఎంపీడీవో సుమనవాణి, డీఆర్వో ఇజాజ్, ఆర్ఐ ఉపేందర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, రెవెన్యూ సిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు.
అవకాశాన్ని వినియోగించుకోవాలి
నర్సంపేట రూరల్: ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని పోడు రైతులు వినియోగించుకోవాలని తాసిల్దార్ వాసం రామ్మూర్తి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆర్వోఎఫ్ఆర్పై సదస్సు నిర్వహించారు. 2005లోపు నుంచి సాగులో ఉండి 4 హెక్టార్లకు మించకుండా భూమి ఉన్న రైతులందరూ అర్హులేనని తెలిపారు. గ్రామ సభల్లో పోడు రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సదస్సులో ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ జయ, ఎంపీడీవో నాగేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్ సంతోష్బాబు పాల్గొన్నారు.