హన్మకొండ, ఆగస్టు 3 : రాష్ట్రంలో అనాథ పిల్లల జీవన ప్రమాణాల మెరుగుపరిచి, వారి భవిష్యత్కు భద్రత కల్పించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ మంత్రి సత్యవతిరాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం హన్మకొండ సుబేదారిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలసదనాన్ని ఈ కమిటీ సందర్శించింది. వారితోపాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బాలసదనంలోని 52మంది పిల్లలతో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి పిల్లల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు అనాథ పిల్లలకు ఏం కావాలో తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు. అనాథ పిల్లలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారి పెళ్లిళ్లు కూడా ప్రభుత్వమే చేయాలనే ఆలోచనలో ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి సలహాలు, సూచనలు తీసుకొని ఈ కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు.
మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలను ఆదుకోవడంపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారని అన్నారు. దేశంలోనే ఆదర్శ సీఎంగా ఉన్న కేసీఆర్ గొప్ప మనసుతో అనాథ పిల్లల సమస్యలు పరిష్కరించాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. 12మంది సభ్యులతో కమిటీ వేశారని, ఈ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అనాథలకు మంచి పాలసీ రాబోతున్నదన్నారు. అనాథ పిల్లల తరఫున సీఎం కేసీఆర్కు పాదాభివందనం అని మంత్రి తెలిపారు. కలెక్టర్ రాజీవ్గాంధీహన్మంతు మాట్లాడుతూ.. ప్రస్తుతం బాల సదనంలో ఆశ్రయం పొందుతున్న పిల్లలకు విద్య, వైద్య సౌకర్యాలతోపాటు మానసిక వికాసం, సృజనాత్మకత పెంచేందుకు వినోదం, విజ్ఞాన, విహార యాత్రలు, వీకెండ్ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ చైర్మన్ ప్రకాశ్, ఎంపీ మాలోత్ కవిత, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్ వసంతా మహేందర్రెడ్డి, ఆర్డీవో వాసుచంద్ర, హన్మకొండ ఏసీపీ జితేందర్రెడ్డి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అన్నమనేని అనీల్చందర్రావు, సభ్యులు దామోదర్, సుధాకర్, ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీబాయి, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల సంక్షేమాధికారులు సబిత, శారద, హన్మకొండ తహసీల్దార్ రాజ్కుమార్, బాలికా సదనం సూపరింటెండెంట్ వెరోనిక తదితరులు పాల్గొన్నారు.