జనగామ, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ)/ స్టేషన్ఘన్పూర్ : జనగామ జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలకు గాను రెండింట్లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. జనగామ, స్టేషన్ఘన్పూర్లో ముచ్చటగా మూడోసారి గులాబీ గుబాళించగా, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు ఓటమి పాలయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి గెలుపొందారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికలు సహా 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో రెండు పర్యాయాలు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ను ఆదరించిన ప్రజలు కాంగ్రెస్ హవాలోనూ జనగామ, స్టేషన్ఘన్పూర్ ప్రజలు పార్టీ అభ్యర్థులను అక్కున చేర్చుకున్నారు. ఆదివారం జనగామ మండలం పెంబర్తిలోని పాత విద్యాభారతి ఇంజినీరింగ్ కళాశాల (వీబీఐటీ)లో లెక్కింపు జరుగగా, జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి తన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్రెడ్డిపై 15,783 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
అలాగే స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి తన సమీప ప్రత్యర్థి సింగాపురం ఇందిరపై 7,779 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జనగామలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు మొత్తం 98,557 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరికి 83,192 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఆరుట్ల దశమంత్రెడ్డి మాత్రం కేవలం 7,595 ఓట్లకు పరిమితమయ్యా రు. ఆయనతోపాటు పాలకుర్తిలో లేగ రాంమోహన్రెడ్డి, స్టేషన్ఘన్పూర్లో గుండె విజయరామారావు సైతం డిపాజిట్ కోల్పోయారు. జనగామ సెగ్మెంట్లో మొత్తం 20 రౌండ్లలో జరిగిన ఓట్ల లెక్కింపులో ఆఖరి రౌండ్ మినహా ప్రతీ రౌండ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా అధిక్యత కనబరిచారు.
ఇక్కడ తొలి రౌండ్ నుంచే 1,304 ఓట్ల లీడ్తో ప్రారంభమైన జనగామ అభ్యర్థి ఎన్నికల ఫలితం 19 రౌండ్ల వరకు ఏ మాత్రం తగ్గకుండా కొనసాగింది. చివరిదైన ఒక్క 20వ రౌండ్లోనే కాంగ్రెస్ అభ్యర్థికి 435 ఓట్ల స్వల్ప ఆధిక్యం లభించింది. జనగామ జిల్లాలో మూడు నియోజకవర్గాలకు గానూ రెండు స్థానాల ఓట్ల లెక్కింపు ఫలితాలలో మధ్యాహ్నం వరకు ట్రేండ్ బీఆర్ఎస్ వైపు కొనసాగుతుండడంతో జనగామ కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి మధ్యలోనే వెనుదిరిగారు. స్టేషన్ఘన్పూర్ అభ్యర్ధి ఇందిర మాత్రం కౌంటింగ్ కేంద్రానికి దూరంగా ఉండి తమ క్యాడర్ను పంపించగా, ఫలితాల సరళిని గమనించిన నాయకులు, కార్యకర్తలు మధ్యలోనే వెళ్లి పోయారు. ఇక కడియం శ్రీహరి గెలుపు ఖాయమని తేలిన తర్వాత కౌంటింగ్ కేంద్రానికి చేరుకొని లెక్కింపు సరళిని పరిశీలించి రిటర్నింగ్ అధికారి వాసాల రాంమూర్తి నుంచి గెలుపు పత్రాన్ని అందుకున్నారు. జనగామ బీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్రెడ్డి మాత్రం ప్రారంభం నుంచే కౌంటింగ్ కేంద్రంలో ఉండి పోస్టల్ ఓట్ల లెక్కింపు సహా రౌండ్ల వారీగా జరిగిన లెక్కింపును స్వయంగా పర్యవేక్షించారు. పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు కౌంటింగ్ కేంద్రానికి దూరంగా ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి ఫలితం తనకు అనుకూలంగా ఉందన్న సమాచారంతో కేంద్రానికి వచ్చారు. యశస్వినిరెడ్డి 47,547 ఓట్ల మెజార్టీతో ఎర్రబెల్లిపై విజయం సాధించారు. కాగా, జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు.
జనగామ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు క్షణక్షణం ఉత్కంఠ భరితంగా పోస్టల్ ఓట్ల లెక్కింపు మొదలు తొలి ఐదు రౌండ్ల వరకు మెజార్టీపై ఆకస్తి నెలకొన్నది. అయితే ఇక్కడ మొత్తం 20 రౌండ్లకు గాను చివరి రౌండ్ మినహా మిగిలిన 19 రౌండ్లలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యతను కనబరిస్తూ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మొదటి రౌండ్లో పల్లా 5578 ఓట్లు సాధిస్తే, కాంగ్రెస్ అభ్యర్థి 4,274 ఓట్లకు పరిమితమై 1304 లీడ్తో బీఆర్ఎస్ బోణీకొట్టింది. ఇలా ఒక్కో రౌండ్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ మెజార్టీ దక్కించుకన్నారు.