రూ.9.8లక్షలతో బయోడైవర్సిటీ గేట్
రూ.14.70లక్షలతో బటర్ ఫ్లై గార్డెన్, నైట్ క్యాంపెయిన్ రచ్చబండలు, పాత్వేలు
పూర్తికావచ్చిన పనులు..
త్వరలో ప్రారంభానికి ఏర్పాట్లు
ఖానాపురం, ఏప్రిల్ 9 : సహజసిద్ధ అందాలతో కనువిందు చేసే పాకాల మరిన్ని సొబగులను అద్దుకున్నది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కొత్తకళను సంతరించుకుని త్వరలోనే పర్యాటకులను కనువిందు చేయనున్నది. ఇప్పటికే పాకాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చించిన సర్కారు, సుందరీకరణ పనులకు రూ.24.50 లక్షలు కేటాయించింది. వీటితో పాకాలకు మరింత వన్నె తెచ్చే పలు పనులు పూర్తికావొచ్చాయి.
బయోడైవర్సిటీ గేట్
పాకాలకు మరిన్ని పర్యాటక హంగులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అటవీశాఖ ఆధ్వర్యంలో రూ.24.50 లక్షలు కేటాయించగా, రూ.9.80లక్షలతో పాకాల బయోడైవర్సిటీ పార్కు ఎంట్రన్స్గేట్ ఏర్పాటు చేశారు. బటర్ైప్లె గార్డెన్, చిల్ట్రన్స్ పార్కు, ఔషధమొక్కల పార్కుల ఆధునీకరణ, ఆరు నైట్ క్యాంపెయినింగ్ రచ్చబండలు, పాత్వేలు, బెంచీలు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు. పాకాల అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులు మరింత సంతృప్తి చెందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాకాల సరస్సు కట్టపైకి వెళ్లేందుకు ఎంట్రన్స్లో కొత్తగా నిర్మించిన బయోడైవర్సిటీ పార్కు గేటు ఇక్కడి అందాలను రెట్టింపు చేసింది. గతంలో పాకాలకు గేటు సదుపాయం లేక ఇక్కడి విలువైన సంపద చోరులపాలైంది. ఆకతాయిల ఆగడాలు కూడా ఎక్కువ ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తుండడంతో పాకాలకు మంచిరోజులు వచ్చాయి. ఇక్కడ గేటు నిర్మించి సెక్యూరిటీ సిబ్బందిని నియమించడంతో పర్యాటకులకు పూర్తి రక్షణ లభించినట్లయింది. ప్రస్తుతం పాకాలకు చిహ్నంగా జీవవైవిధ్యాన్ని చూపుతూ గేటు ఏర్పాటు చేయడంపై పర్యాటకుల్లో సంతోషం కనిపిస్తున్నది.
ఇవి కూడా చదవండి..
ఐపీఎల్.. పవర్ప్లేలో ఆర్సీబీ 46/2
శ్రీశైలంలో రేపటి నుంచి ఉగాది మహోత్సవాలు