ఖిలావరంగల్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. గురువారం వరంగల్ జిల్లా కలెక్టర్ చాంబర్లో నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు నియమించిన నోడల్ అధికారులు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వహించలన్నారు. పోలీంగ్ స్టేషన్ల బాధ్యతను జెడ్పీ ఈసీఓ రాజారావుకు, మెటీరియల్ మేనేజ్మెంట్కు నోడల్ అధికారిగా ఇండస్ట్రీ జీఎం నరసింహమూర్తి, మాడల్ కోడ్ అమలు పర్యవేక్షణకు నరేష్కుమార్, కౌంటింగ్ ఇన్చార్జి, అబ్జర్వర్ల కోసం ఆర్డీఓ మహేందర్జీ, మీడియా సర్టిఫికేషన్ కమిటీ ఇన్చార్జిగా డీపీఆర్ఓ పల్లవి, మెటీరియల్ కొనుగోలు, టీఏ, డీఏ చెల్లింపు బాధ్యతలను ఏఓ రాజేంద్రనాథ్, కోవిడ్-19 నిబంధనలు సరిగా అమలు చేసేందుకు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, వాహనాల ఏర్పాటుకు ఆర్డీఓ ఆఫ్రీన్సిద్దిఖీలను నోడల్ అధికారులుగా కలెక్టర్ నియమించారు.
పూర్తి కో-ఆర్డినేషన్తో నోడల్ అధికారులు అందరూ ఎన్నికల్లో తమ విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, నోడల్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు.