నాలుగు రోజుల కిందట మహేశ్వరం నియోజకవర్గంలోని నందిహిల్స్ చౌరస్తాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాత్రి వరకు జరిగిన ప్రచారంలో జనంతో పాటు స్థానిక విద్యుత్తు శాఖ సిబ్బంది సైతం అక్కడే ఉన్నారు. కారణం?! కరెంటు ఎప్పుడు పోతుందోనన్న ఆందోళన సాధారణ జనాన్ని మాత్రమే కాదు.. చివరకు విద్యుత్తుశాఖ అధికారులు, సిబ్బందిని సైతం వెంటాడుతున్నది. అందుకే కరెంటు పోగానే వెంటనే పునరుద్ధరించేందుకు నలుగురైదుగురు సిబ్బంది కాపలాగా ఉన్నారు. ‘పాపం.. పార్టీల సభకు పోలీసులు మాత్రమే ఉండేవాళ్లు. ఇప్పుడు కరెంటోళ్లు కూడా ఉంటున్నారు. ఎప్పుడు కరెంటు పోతుందో! కరెంటు పోతే ఎక్కడ మా ఉద్యోగం పోతుందో! అన్న భయంతో కరెంటోళ్లు తమ డ్యూటీ టైం ముగిసినా రాత్రి వరకు ఇక్కడే ఉన్నారు’ అని సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.
రెండు రోజుల కిందట మాజీ మంత్రి హరీశ్రావు బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మీట్ది ప్రెస్కు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన వెంటనే బయటికొస్తుండగా ఆయనకు పోలీసులతో పాటు విద్యుత్తుశాఖ యంత్రాంగం కనిపించింది. ‘మేం ఉద్యమంలో ఉన్నపుడు మా వెంట పోలీసోళ్లు కనిపెట్టుకుని ఉండేవాళ్లు. ఇప్పుడేమో విద్యుత్తుశాఖ అధికారులు, సిబ్బంది కూడా ఉంటున్నారు. ఇదెక్కడి విచిత్రం’ అని హరీశ్రావు అన్నారు.
Congress Govt | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 6 (నమస్తే తెలంగాణ): ప్రముఖులు పాల్గొనే సభల్లో సీఆర్పీఎఫ్, పోలీసులు, ఇతర భద్రతాసిబ్బంది పహారా కాస్తుంటారు. కానీ, విచిత్రంగా బీఆర్ఎస్ పాల్గొన్న సభల్లో కరెంటు అధికారులు కాపలా కాస్తున్నారు. ఎందుకంటే.. స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరెంటు కోతల ప్రభావానికి గురవటం, మంత్రి సీతక్క సమావేశంలో కరెంటు పోవటం, మాజీమంత్రి మల్లారెడ్డి మీటింగ్లో విద్యుత్తు కోతలు ఎదురవటం లాంటి అనేక ఘటనలను ‘నమస్తే తెలంగాణ’ ఫొటోలతో సహా ప్రముఖంగా ప్రచురించింది. కరెంటు కోతలే లేవని చెప్తామనుకున్న సీఎం, మంత్రులకు నమస్తే తెలంగాణ ఆధారాలతో సహా బయటపెట్టేసరికి ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. దీంతో ఫొటోల వల్ల సమస్య వస్తున్నదని, కరెంటు పోతే వెంటనే సరిచేసేందుకు, ఫొటోలు తీసే అవకాశం ఇవ్వకుండా విద్యుత్తు సిబ్బందిని రంగంలోకి దించింది కాంగ్రెస్ సర్కారు. మొదట్లో ఎస్పీడీసీఎల్ సిబ్బందిని నేరుగా సభలు, రోడ్షోల వద్ద ఉంచగా, వాళ్ల ఐడెంటిటీ బయటపడుతున్నదన్న ఉద్దేశంతో వారిని సివిల్ డ్రెస్సుల్లో కాపలా ఉంచుతున్నది. మొత్తానికి కరెంటుకే కాపలా పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది.
ముఖ్యంగా కరెంటు సరఫరాలో అంతరాయాలు సాధారణంగా మారటంతో విద్యుత్తుశాఖ కాపలా బాధ్యతను భుజాన వేసుకొన్నది. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తుండటంతో ఎక్కడ సభలు, సమావేశాలు, రోడ్షోలు జరిగినా అక్కడ పోలీసుశాఖ కంటే ముందుగానే విద్యుత్తు సిబ్బంది ప్రత్యక్షమవుతున్నారు. కార్యక్రమాలు ముగిసే వరకు కరెంటు పోకుండా చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరాయంగా, నాణ్యమైన కరెంటును ఇస్తామని చెప్తున్నా, క్షేత్రస్థాయిలో విద్యుత్తుశాఖ అధికారులు పడుతున్న పాట్లు చూస్తుంటే సర్కారు మాటలు నీటిమూటలేనని స్పష్టమవుతున్నది. వేసవిలో ఒకవైపు కరెంటు కోతలు, ఇంకోవైపు నీటి కొరత జనాన్ని వేధిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం అదేమీ లేదంటూ నిత్యం బుకాయిస్తున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలు.. కాంగ్రెస్ నేతల వరకు కరెంటు కోతలకు బాధితులుగానే మిగిలారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఉంటే, ఇప్పుడేమో పరిస్థితి ఇలా ఉందంటూ ప్రజల నుంచి తీవ్రస్థాయిలో సర్కారుపై వ్యతిరేకత వచ్చింది. దీనిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులపై సీరియస్ కావటం, ఆ ప్రభావం కిందిస్థాయి సిబ్బంది వరకు పడింది. కొన్నిరోజుల కిందట మాజీ మంత్రి మల్లారెడ్డి దమ్మాయిగూడలో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తుండగా కరెంటు పోవటం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేసి ఏకంగా డీఈఈని సస్పెండ్ చేయటంతో పాటు ఏఈఈకి మెమో జారీ చేశారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఎండ తీవ్రత దృష్ట్యా సాయంత్రం నుంచి రాత్రి పది గంటల వరకు ఎక్కువగా సమావేశాలు, రోడ్షోలు నిర్వహిస్తున్నాయి. దీంతో ఈ కార్యక్రమాలు ఉన్న చోట విద్యుత్తుశాఖ తమ సిబ్బందికి అదనపు డ్యూటీలు వేస్తున్నది.