వరంగల్: వరంగల్లోని ఎల్బీనగర్లో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో అన్న కుటుంబంపై తమ్ముడు దాడికి పాల్పడ్డాడు. దీంతో మహిళ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎల్బీనగర్ చెందిన చాంద్పాషా తన తమ్ముడు షఫీతో కలిసి పశువుల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి.
అన్నపై కక్ష పెంచుకున్న తమ్ముడు షఫి.. మరికొందరితో కలిసి మంగళవారం రాత్రి చాంద్పాషా కుటుంబంపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డాడు. దీంతో చాంద్ పాషా (50), ఖలీల్ (40), సమీరా (42) అక్కడికక్కడే మృతిచెందారు. సమద్, ఫహద్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆస్తి తగాదాలే ఘటనకు కారణమని వెల్లడించారు. కాగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.