హనుమకొండ, డిసెంబర్ 14 : విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ ఎంతో కీలకమైంది. ఈ సమయంలో ఉన్నత చదువుల కోసం తీసుకొనే నిర్ణయం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు అవగాహన లేక ఏదో ఒక కోర్సులో చేరి తప్పటడుగులు వేస్తూ, తమ లక్ష్యాన్ని చేరుకోక అయోమయానికి గురవుతున్నారు. ఇందుకుగాను ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఉన్నత చదువులు, భవిష్యత్తు ప్రణాళిక, లక్ష్యాలు చేరుకోవడంపై సరైన అవగాహన కల్పించాలనే దృఢసంకల్పంతో ‘నమస్తే తెలంగాణ’, ‘కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ’ సంయుక్తంగా ఏకశిల విద్యాసంస్థల ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ జిల్లా దామెరలోని ఏకశిల క్యాంపస్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు విద్యార్థులకు ఇంటర్మీడియట్ తర్వాత వెళ్లే ఉన్నత చదువుల కోసం కోర్సుల ఎంపికపై అవగాహన కల్పించారు. అనంతరం లక్కీడిప్ ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
ప్రతి విద్యార్థి లక్ష్యసాధనకు కృషిచేయాలి. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీల ఎంపిక ఎంతో కీలకం. ఇంటర్ తర్వాత బైపీసీ తీసుకున్న వారు మెడిసిన్ వైపు, ఎంపీసీ వారు ఇంజినీరింగ్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంబీబీఎస్, ఇంజినీరింగ్లో సీఎస్సీ రాకపోతే జీవితమే కోల్పోయినట్లు విద్యార్థులు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు. రాకపోతే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అంతకన్నా మంచి కోర్సులు ఉన్నప్పటికీ వాటిపై అవగాహన లేక అటువైపు వెళ్లడం లేదు. ప్రస్తుతం అన్ని ఉద్యోగాల్లో బీటెక్ చేసిన వారే ఎక్కువగా ఉంటున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. గూగుల్లో చూసి యూనివర్సిటీలు ఎంపిక చేసుకోవడం కరెక్ట్ కాదు. ఉత్తమమైన కెరీర్, అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే మీరు నేరుగా చేరాలనుకొనే యూనివర్సిటీలకు రెండు మూడు పర్యాయాలు వెళ్లాలి. అక్కడి స్థితిగతులు, ఫ్యాకల్టీ, ఇతరత్రా వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవడంతో పాటు ఎన్ఐఆర్ఎస్ ప్రభుత్వ ర్యాంకులను సైతం పరిశీలించి యూనివర్సిటీని ఎంపిక చేసుకోవాలి.
అలాగే వర్సిటీల్లో చదువుతున్న, చదువు పూర్తైన విద్యార్థులు తెలిసి ఉంటే వారితో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవాలి. 1980లో విజయవాడలో, 2009లో హైదరాబాద్లో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలను ప్రారంభించాం. ఈ యూనివర్సిటీల్లో ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు స్కిల్స్ డెవలప్ చేసేందుకు అనుభవజ్ఞులైన, నైపుణ్యం కల్గిన డాక్టరేట్ చేసిన ఫ్యాకల్టీ, ప్రాక్టికల్స్ నిర్వహణతో పాటు శాస్త్ర సాంకేతిక, వైజ్ఞాన కేంద్రంగా విరాజిల్లుతున్నది. దేశంలో కేటగిరీ-1లో ఉన్న యూనివర్సిట్లీలో కేఎల్ యూనివర్సిటీ ఉంది. అంతేకాక వివిధ దేశాల విద్యార్థులు కేఎల్లో విద్యను అభ్యసిస్తున్నారు. విశ్వవిద్యాలయంలో మూడు సంవత్సరాలు చదివి నాలుగో ఏట ఉద్యోగం చేస్తూ యూనివర్సిటీకి వస్తున్నారు. ఈ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులకు అత్యధిక ప్యాకేజీతో(రూ.లక్షల్లో) దేశ, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మంచి ప్యాకేజీతో ఉద్యోగం చేయాలనుకొనే విద్యార్థులకు కేఎల్ వర్సిటీ ఆ స్థాయిలో నైపుణ్యం పెంపొందిస్తుంది. నైపుణ్యంతో పాటు క్రమశిక్షణ కూడా ముఖ్యం.
మొదటి సంవత్సరం నుంచే ఒక ప్రణాళిక ప్రకారం చదివితే లక్ష్యాలను చేరుకోవడం సులభమవుతుంది. నైపుణ్యం, క్రమశిక్షణ ఉన్న వారికి ప్రపంచంలో ఎక్కడైనా ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు మంచి ప్యాకేజీ వస్తుంది. కేవలం చదువే కాదు.. బయట ప్రపంచంపై కూడా అవగాహన కలిగి ఉండాలి. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు ఎంతో ప్రాచుర్యం పొందాయని ఆయన పేర్కొన్నారు.
– కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్.కోటేశ్వర్రావు
నిత్యం పత్రికలు చదవాలి: నమస్తే తెలంగాణ వరంగల్ యూనిట్ మేనేజర్ పందిళ్ల అశోక్కుమార్
ప్రతి విద్యార్థి రోజూ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనకు ప్రపంచంలో జరిగే విషయాలపై అవగాహన ఉంటుంది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా చేపట్టిన అవగాహన కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నమస్తే తెలంగాణలో ప్రతి బుధవారం వస్తున్న నిపుణ ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ఉద్యోగ సమాచారం, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్ అందిస్తున్నది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో గోల్ పెట్టుకొని ముందుకు సాగితే సక్సెస్ అవుతారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బ్యూరో ఇన్చార్జి పిన్నింటి గోపాల్రావు, అడ్వైర్టెజ్మెంట్ మేనేజర్ అప్పని సూరయ్య, ఏకశిల విద్యాసంస్థల డైరెక్టర్లు ఎం.జితేందర్రెడ్డి, దినే శ్రెడ్డి, ప్రిన్సిపాల్ సుధాకర్రెడ్డి, నమస్తే తెలంగాణ, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ, ఏకశిల విద్యాసంస్థల సిబ్బంది పాల్గొన్నారు.
చాలా ఉపయోగపడుతుంది
ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత చదువుల కోసం కోర్సులు, యూనివర్సిటీల ఎంపిక విషయంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సు చాలా ఉపయోగపడుతుంది. అన్ని విషయాలు క్షుణ్ణంగా వివరించారు. ఈ సదస్సుతో నాకు క్లారిటీ వచ్చింది. కోర్సుల ఎంపికతో పాటు అన్ని అంశాలపై చక్కగా దిశానిర్దేశం చేశారు.
– టి.ఐశ్వర్య, ఇంటర్ సెకండియర్
మంచి ప్రోగ్రాం
మాది వరంగల్. నేను ఇక్కడ ఇంటర్మీడియట్ ఎంపీసీ రెండో సంవత్సరం చదు వుతున్నా. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాం చాలా బాగుంది. కోర్సులు, యూనివర్సిటీల ఎంపిక లాంటి అన్ని విషయాల గురించి సవివరంగా తెలియజేశారు. ఏ కోర్సులో చేరితే లక్ష్యాలను చేరుకోవచ్చనే దానిపై అవగాహన కల్పించారు. నేను ఇంజినీర్ కావాలనుకుంటున్నా. – కె.గోపిక, వరంగల్
లక్ష్యం చేరుకుంటా..
ఈ అవగాహన సదస్సుతో జీవితంలో ఎంచుకున్న లక్ష్యసాధనకు ఏ విధంగా ముందుకు వెళ్లాలో అర్థమైంది. అన్ని అంశాలపై అవగాహన కల్పించారు. ఏ గ్రూప్లో, ఏ యూనివర్సిటీని ఎంపిక చేసుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయి, ఉద్యోగాలు వస్తాయనే అంశాలను వివరించారు.
– పి.సిద్ధ్దార్థ, ఎంపీసీ
ఎటువెళ్లాలో అవగాహన వచ్చింది..
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ వారు నిర్వహించిన అవగాహన కార్యక్రమం చాలా బాగుంది. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఎటువైపు వెళ్తే జీవితంలో స్థిరపడతామో తెలియజేశారు. ఈ సదస్సు అందరికీ యూజ్పుల్గా ఉంటుంది.
– ఎం.మణికంఠ
స్కిల్స్ పెంచుకుంటే సక్సెస్ మీదే.. ఏకశిల సంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి
విద్యార్థులు కాలానుగుణంగా అప్డేట్ అవుతూ విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ దిశగా కష్టపడి చదవాలి. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత చదువుల కోసం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన సదస్సు విద్యార్థులకు ఉన్నత కోర్సుల్లో చేరేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తమ బంగారు భవిష్యత్తు కోసం ఇంటర్మీడియట్ నుంచే ప్రణాళికలు రూపొందించుకొని ఆ మేరకు కృషిచేయాలి. ఉన్నత చదువుల కోసం మంచి యూనివర్సిటీలను ఎన్నుకోవాలి. ఒకరిపై ఆధారపడకుండా లక్ష్యాలకు అనుగుణంగా ముందుకెళ్లడంతో పాటు స్కిల్స్ పెంచుకొంటే తప్పకుండా సక్సెస్ అవుతాం. ముఖ్యంగా సమయానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఏదో కళాశాలకు వస్తున్నాం.. తరగతి గదిలో పాఠాలు వింటున్నాం అన్నట్లు కాకుం డా సబ్జెక్టును విశ్లేషించుకోవాలి.
చదువుతో పాటు మానవీయ విలువలను కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మెడిసిన్ సీటు రావడం ఎంతో కష్టంగా ఉండేది. కళాశాలలు చాలా తక్కువగా ఉండడం వల్ల తక్కువ సీట్లు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడంతో సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. తద్వారా విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివితే సీటు రావడం చాలా సులభం. రాష్ట్ర సర్కారు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ లైఫ్ మీ చేతిలో ఉంది. మీరు భవిష్యత్తు తరాల విద్యార్థులకు స్ఫూర్తిగా నిలువాలి.