సుబేదారి, జూన్ 7 : అధిక వడ్డీ చెల్లిస్తానని మహిళల నుంచి నగలు, నగదు వసూలు చేసి ఉడాయించిన కిలాడీ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.11.80 లక్షల నగదు, 125 గ్రాముల బంగారు ఆభరణాలు, ఓ ఖరీదైన కారు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిందితుల అరెస్టు వివరాలను సీపీ తరుణ్జోషి మంగళవారం వెల్లడించారు. హనుమకొండ పరిమళకాలనీకి చెందిన కోమళ్ల దివ్య, కిశోర్ దంపతులు చిరువ్యాపారులు. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కొంతమంది కాలనీ మహిళలతో పరిచయం పెంచుకున్నారు. అవసరాల కోసం అప్పుగా డబ్బు లేదా బంగారం తీసుకునేవారు. ప్రతి ఫలంగా అధిక వడ్డీ చెల్లించి నమ్మించేవారు. తాను బైపాస్ సర్జరీ చేసుకోవాలని అప్పు ఇస్తే అధిక వడ్డీ చెల్లిస్తానని దివ్య స్థానిక మహిళలను నమ్మించింది. రూ.43.40 లక్షల నగదు, 430 గ్రాముల బంగారు ఆభరణాలను దివ్య, కిశోర్ దంపతులు తీసుకున్నారు.
కాలనీ నుంచి ఉడాయించి, ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. మోసపోయామని గ్రహించిన బాధితులు కేయూసీ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మంగళవారం హనుమకొండలో కిలాడీ దంపతులు దివ్య, కిశోర్ను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 11.80 లక్షల నగదు, 125 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దంపతులకు సహకరించిన అరుణ, మంజుల పరారీలో ఉన్నారు. కేసులో ప్రతిభ కనబరిచిన టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్, సీఐలు శ్రీనివాస్, శ్రీనివాస్, కేయూసీ సీఐ దయాకర్, ఎస్సైలు లవన్కుమార్, సంపత్, ఏఎస్సై సల్మాన్పాషా, హెడ్ కానిస్టేబుళ్లు సోమలింగం, మాధవరెడ్డి, స్వర్ణలత, కానిస్టేబుళ్లు రాజేశ్, అలీ, భిక్షపతి, శ్రీను, రాజు, శ్రావణ్కుమార్, హోంగార్డు విజయ్ని పోలీస్ కమిషనర్ తరుణ్జోషి అభినందించారు.