ఖరీదైన ఖాళీ ప్లాట్లకు ఫోర్జరీ పత్రాలను సృష్టించి.. విక్రయించేందుకు ప్రయత్నించిన 9 మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం బుధవారం అరెస్ట్ చేసింది. గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు.. సంగారెడ్డి జిల్లా, రాంచంద్రాపురం మండలం, తెల్లాపూర్ గ్రామంలో యూసుఫ్గూడ ప్రాంతానికి చెందిన అర్ని రాఘవేంద్రప్రసాద్ 2007లో తెల్లాపూర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లే-అవుట్లో ప్లాట్ నం. 131, 132లోని 460 గజలా స్థలాన్ని కొనుగోలు చేశాడు.
అప్పటి నుంచి రాఘవేంద్రప్రసాద్ పొజిషన్లో ఉన్నాడు. ఇటీవల తన స్థలాన్ని తానే జీపీఏ ఇచ్చి వాటిని విక్రయించినట్లు తెలుసుకున్న రాఘవేంద్రప్రసాద్ రాంచంద్రాపురం పీఎస్లో ఏప్రిల్ 28న ఫిర్యాదు చేశాడు. ఈ కేసును దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ ఆర్థిక నేరాల నివారణ విభాగం అమీర్పేటకు చెందిన ముఖేశ్ అగర్వాల్.. మరో 12 మందితో కలిసి ఈ స్థలానికి ఫోర్జరీ పత్రాలను సృష్టించినట్లు గుర్తించింది. ముఖేశ్ అగర్వాల్ ఈ స్థలానికి సంబంధించిన సేల్డీడ్ను సబ్రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సీసీ కాపీని తీసి.. అసలు సేల్డీడ్గా రూపొందించి.. స్థల యజమానే జీపీఏ ఇచ్చినట్లు లింక్ డాక్యుమెంట్లను తయారు చేశారు.
ఆ తర్వాత ఈ స్థలాన్ని గజానికి రూ.67 వేలకు మొత్తం 3.12 కోట్లకు విక్రయించేందుకు ఓ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నాడని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బుధవారం ఎండీ వాసి ఉజ్జమాన్, వాగమరి నగేశ్వర్మ, కింజారపు ఢిల్లేశ్వరరావు, యెల్లారెడ్డిగారి సంజీవరెడ్డి, ఎండీ దావూద్ షరీఫ్, ఎండీ అబ్దుల్ ఒమర్, ఎండీ మోసిన్, డాండియా శివకుమార్లను అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు ముఖేశ్ అగర్వాల్ హైకోర్టు నుంచి అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. షేక్ మన్సూర్, సయ్యద్ ఫిరోజ్ అలీ, దాంతం రాజేశ్కుమార్, ఎండీ పాష పరారీలో ఉన్నారు. ఈ స్థలానికి సంబంధించిన ఫోర్జరీ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన ఆర్థిక నేరాల నివారణ విభాగం అధికారులను సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు.