‘పీవీ నరసింహారావు నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చేవారు. క్రమశిక్షణ గల వ్యక్తిత్వం. కులమతాలకు, పేద ధనిక భేదాలకు అతీతంగా వ్యవహరించేవారు. ఎన్ని ఉన్నత పదవులను అలంకరించినా ఒదిగి ఉండేవారు. గొప్ప మానవతా వాది. ఉదారస్వభావి. ఈర్ష్యాద్వేషాలకు అతీతం ఆయన’ అని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయనతో సాన్నిహిత్యాన్ని, జ్ఞాపకాలను నమస్తే తెలంగాణతో పంచుకున్నారు.
పీవీ ఏ హోదాలో వున్నా ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాలను ప్రోత్సహించ లేదు. పైరవీలకు, బంధుప్రీతికి అవకాశమివ్వలేదు. వ్యవస్థ ప్రయోజనాలకు, సమాజ సంక్షేమానికే ప్రాధాన్యమిచ్చేవారు. ఉన్నతాధికారులు బదిలీల కోసం, రాజకీయ నేతలు వ్యక్తిగత పనుల కోసం వచ్చినా ఏనాడూ పట్టించుకోక పోయేది. అదే ఎవరైనా తమ గ్రామానికి సంబంధించిన సమస్యను దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేవారు. సమర్థులను గుర్తించి, ప్రోత్సహించే వారు. కవులు, కళాకారులు, మేధావులు వివిధ రంగాలలోని నిపుణులను సముచితంగా గౌరవించేవారు. ప్రఖ్యాత మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ళ వేణుమాధవ్ను తనతోపాటు ఎన్నోసార్లు విదేశాలకు తీసుకువెళ్ళి ఆయన ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. పుట్టుకతో పెద్ద జమీందారు అయినప్పటికీ పేదల కష్టాలూ కన్నీళ్లూ తెలిసినవారు. తనకున్న 12వందల ఎకరాలలో చాలా భూమిని బీదసాదలకు పంచిపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలు చేపట్టి, భూస్వాముల ఆగ్రహానికి గురయ్యారు. ముఖ్యమంత్రి పదవిని సైతం పోగొట్టుకోవాల్సి వచ్చింది. తను నమ్మిన ఆదర్శాలను ఆయన ఏనాడూ విడనాడలేదు.
అరుదైన వ్యక్తిత్వం గల తెలుగు తేజం మన పీవీ. తత్వవేత్తలే సమాజానికి, దేశానికి ఉత్తమమైన పాలకులని, వారైతేనే పాలనలో న్యాయాన్ని, ధర్మాన్ని సమానంగా, సమతుల్యంగా స్వీకరిస్తారని ప్రాచీన గ్రీకు తత్వవేత్త ప్లేటో సూత్రీక రించారు. స్థితప్రజ్ఞుడు, అపర చాణక్యుడు, సాహితీవేత్త, మూర్తిభవించిన తెలుగుతనంగా భాసించిన పీవీకి ఈ సూత్రీకరణ అక్షరాలా వర్తిస్తుంది. ఆయన ఒక గొప్ప రాజకీయ నాయకుడే కాదు- కవిగానూ, రచయితగానూ ప్రసిద్ధి చెందారు. ఆయనలో అంతర్లీనంగా ఒక చిత్రకారుడు, ఒక తత్వవేత్త, ఒక శాస్త్ర పరిశోధకుడు కూడా ఉన్నారు. నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంలో పాల్గొన్న పోరాట వీరుడు పీవీ. ఆయన మొదట చేపట్టింది న్యాయవాద వృత్తి. ఆ విధంగా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇన్ని ప్రత్యేకతలు, ఇంత విలక్షణత వున్న ఒక మహా మనీషి తెలంగాణ బిడ్డ కావడం తెలంగాణ వారంతా గర్వించ దగ్గ విషయం. ఆయన జీవితమంతా నమ్ముకుని వున్న కాంగ్రెస్ పార్టీ ఆయనకు సరయిన గౌరవం, గుర్తింపు ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితిలో ముఖ్య మంత్రి కేసీఆర్ ఎవరూ ఊహించని విధంగా పీవీ శతజయంతి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని నిర్ణయించడం సర్వదా హర్షణీయం. పీవీ మన ఠీవి అని ఘనంగా చాటిచెప్తున్నారు. కేవలం తెలంగాణ బిడ్డ అన్న ఒక్క అభిమా నంతో ఇంతటి గౌరవాన్ని ఇస్తున్న కేసీఆర్ను తెలంగాణ ప్రజలంతా అభిమాని స్తున్నారు. ఆయన ఏ పని చేసినా తెలంగాణవారంతా సంతోషంగా తల ఎత్తుకుని గర్వించే విధంగానే చేస్తారు. ఇది నిర్వివాదాంశం.
ఆయన నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చేవారు. క్రమశిక్షణ గల వ్యక్తిత్వం. బీదవారి గురించి పరితపించిపోయేవారు. ఒక ఉదాహరణ చెబుతాను. ఒకరోజు ఢిల్లీలో కరీంనగర్ శాసనసభ్యులు, ఎంపీలు, ఇతర మిత్రులు ఆయనను కలిసి కూర్చుని ముచ్చటిస్తున్న సందర్భంలో పీవీ చాలా విషయాలు మాట్లాడారు. రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు దేశమంతటా విస్తరించాలని అన్నారు. దేశంలోని ఏ మారుమూల ప్రాంతానికైనా మోటార్ కార్లలో వెళ్ళగలగాలని, దేశంలోని పేదలు ఏ మూల నుంచైనా సరే, మరొక మారుమూలలోని ప్రాంతవాసులతో సునాయాసంగా మాట్లాడగలగాలని అన్నారు. సాధారణ ఖర్చులతో దేశం మొత్తం చుట్టి రావాలి. అప్పుడే ఈ దేశం సగం అభివృద్ధి చెందినట్లు అని చెప్పారు. ఆయన పీఎం అయ్యాక దానిని నిజం చేసి చూపారు. టెలికమ్యూనికేషన్స్ రంగంలో నూతన శకానికి నాంది పలికారు. ఆయన చలువ వల్లే ఈనాడు సెల్ ఫోన్ నిరుపేదలకు కూడా హస్త భూషణమైంది. రవాణా రంగంలో కూడా ఎన్నో సంస్కరణలు చేపట్టారు. చెప్పిన మాటను ఆచరించి చూపిన ఆదర్శమూర్తి పీవీ. ఏ హోదాలో వున్నా ఆయన మంథనికి వచ్చారంటే టౌన్ మొత్తం కలియతిరిగి అందర్నీ పలకరించేవారు. మరీ ముఖ్యంగా తనకు తెలిసినవారు, చనిపోయిన వారు ఉంటే వారింటికి వెళ్ళి పరామర్శిచేవారు. తిరిగి వెళ్ళే వరకు పీవీతోనే అందరం ఉండేవాళ్ళం. ఒకసారి రామగుండం, మంథని వచ్చినప్పుడు, తిరుగు ప్రయాణంలో కరీంనగర్ సమీపంలోని రేకుర్తిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన చారిటబుల్ కంటి దవాఖానాను 1985లో పీవీ ప్రారంభించారు. ఇది పూర్తిగా ఒక ప్రైవేటు కార్యక్రమం. ఆ దవాఖానా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అత్యుత్తమ రూరల్ కంటి దవాఖానాగా విజయవంతంగా పనిచేస్తున్నది.
పీవీతో మీకున్న మరిచిపోలేని జ్ఞాపకాలను వివరిస్తారా?
పీవీతో కలిసిన ప్రతిక్షణం నాకు మధుర జ్ఞాపకమే. స్ఫూర్తిదాయకమే. ఇప్పటికీ రామగుండం ప్రాంతాన్ని చూసినప్పుడల్లా ఆయనే మదిలోకి వస్తారు. అందుకు ప్రత్యేక కారణముంది. రామగుండం పరిధిలోని జనగామ గ్రామ పంచాయతీకి అప్పుడు గీట్ల జనార్దన్రెడ్డి సర్పంచుగా ఉండేవారు. పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవానికి పీవీ ముఖ్య అతిథిగా వచ్చారు. అప్పటి ఆయన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఇది ఊరు కాదు, పట్టణం కాదు, నగరం కాదు అంటూ మళ్ళీ ఇంగ్లీష్లో విలేజ్ కాదు, టౌన్ కాదు, సిటీ కాదు – మరి ఏంది? అని మమ్ములను అడిగినారు. మేము ఏమీ సమాధానం చెప్పలేదు. ఒక రెండు నిమిషాలు ఆగి మళ్ళీ తనే చెప్పారు. ఇదొక జాతర – తిరునాళ్ళు. సమ్మక్క, సారలమ్మ జాతరలా రామగుండం కూడా అభివృద్ధి చెందుతుంది. పెద్దగా ఎదుగుతుంది అని చెప్పారు. అది ఇప్పుడు కండ్లముందు కనిపిస్తున్న వాస్తవం. నాకు ఎప్పుడు రామగుండాన్ని చూసినా ఆనాటి పీవీ మాటలే గుర్తుకు వస్తాయి. 1995లో ప్రధాని హోదాలో పెద్దపల్లి- నిజామా బాద్ వయా కరీంనగర్ రైల్వేలైన్కు పీవీ శంకుస్థాపన చేశారు. మరోసారి కోరుట్ల- మెట్పల్లి గోదావరి వరద కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అది ఈరోజు జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి వాసులకు వరప్రదాయినిగా మారింది.
మాది రామగుండం. అక్కడి మాజీ సర్పంచ్ సత్యనారాయణరావు (సత్తయ్య పంతులు)ను కలిసేందుకు పీవీ 1980లో విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి వచ్చారు. అప్పుడు నేను యువకుడిని. అక్కడే నేను మొదటిసారి పీవీని కలిశాను. నేను కూడా కాంగ్రెస్ పార్టీలోనే వున్నందున, పార్టీ పనుల మీద, రోశయ్యగారితోనూ పీవీగారిని చాలాసార్లు కలిశాను. ఆ విధంగా ఆయనతో సాన్నిహిత్యం పెరిగింది. పీవీ రామగుండం ప్రాంతానికి వచ్చిన ప్రతిసారి ఆయనను రిసీవ్ చేసుకునేందుకు, వీడ్కోలు చెప్పేందుకు కొంతమందితో కలిసి వెళ్ళేవాడిని. పీవీ ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా వచ్చేవారు. ప్రధాని అయ్యాక కూడా అదే పరిస్థితి. అప్పుడప్పుడు ఢిల్లీ వెళ్ళి కలిసేవాడిని. ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా, వివిధ హోదాల్లో పనిచేస్తున్నప్పుడు కూడా పలు సందర్భాల్లో మంథనికి ప్రత్యేకంగా వచ్చేవారు. ఆయన పాత స్నేహితులను కలుసుకునేవారు. కరీం నగర్ జెడ్పీ మాజీ చైర్మన్ పనకంటి కిషన్రావు ఇంటికి వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకునేవారు. అక్కడే భోజనం చేసేవారు. గుమ్మడికాయ బరడా ఆయన అభిమాన వంటకం. తోవలో (రామగుండం నుంచి మంథని వెళ్ళే దారిలో) గుంజపడుగు గ్రామంలో మాజీ సర్పంచ్ రేగళ్ళ రాజన్నను కలుసుకుని, వాళ్ళింట్లో నులకమంచంపై కూర్చుని చాయ్ తాగేవారు. నేల మీద కూర్చుని భోజనం చేసేవారు.
అది 1991 ఆరంభ కాలం. దేశంలో పదో లోక్సభ ఎన్నికల సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. రాజీవ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో యువరక్తం నింపుతారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో సీనియర్.. నెహ్రూ, గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడైన పీవీకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవచ్చనే ప్రచారం ఊపందుకున్నది. ఢిల్లీ అంతటా అదే చర్చనీయాంశంగా ఉంటున్నది. సరిగ్గా ఆ పరిస్థితుల్లో అక్బర్రోడ్డులోని రాజీవ్ ఇంటికి చేరుకున్నారు పీవీ. రాజీవ్తో మరికొంత మంది ఆయన యువ ఆంతరంగికులున్నారు. నాడున్న ప్రచారం నేపథ్యంలో పీవీ కొంత ఉద్విగ్నంగా ఉన్నారు. అంతా ప్రచారం సాగినట్లుగానే.. పీవీని చూసిన వెంటనే రాజీవ్.. ‘మిస్టర్ నర్సింహారావు, మీరు బాగా పెద్దవాళ్లయ్యారు. మీరిక లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నేను అనుకోవటం లేదు. తరువాత మిమ్మల్ని నేను రాజ్యసభలోకి తెచ్చుకుంటాను’ అని పీవీతో అన్నారు. ఆ తర్వాత.. పీవీని అనునయిస్తున్నట్లుగా.. రాబోయే ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టో ముసాయిదాను తయారు చేయవలసిందిగా రాజీవ్ అడిగారు. ‘మ్యానిఫెస్టోను పార్టీ వర్కర్లు ఎవరూ చదువరు. సగటు ఓటర్లు అంతకన్నా చదవరు. కనుక అదొక పెద్ద బాధ్యత కానేకాదు’ అని పీవీ తగిన విధంగా తనదైన శైలిలో జవాబిచ్చారు.
1971 సెప్టెంబర్లో కాసు బ్రహ్మానందరెడ్డి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ నియమితులయ్యారు. దీనికి కలిసి వచ్చిన అంశం.. ఇందిరా గాంధీ దృష్టిలో పీవీ రాజకీయంగా బలహీనుడు కావటమే. ఇదే ధోరణి ఆ తర్వాత కాలంలో కూడా కాంగ్రెస్ ఓ విధానంగా అనుసరించింది. 1991లో రాజీవ్ హత్య అనంతరం నెహ్రూ కుటుంబానికి విధేయుడైన ఒక అనుభవజ్ఞుణ్ని ప్రధాని చేయాలని సోనియాగాంధీ అనుకున్నప్పుడు కనపడిన (బలహీన) మేధావి పీవి. అలాగే 2004లో మన్మోహన్సింగ్ను ప్రధానమంత్రిగా పార్టీ అధ్యక్షురాలు ఎంచుకోవటంలో ప్రధాన కారణం.. తనను ధిక్కరించ గల రాజకీయ బలం లేనివాడనే. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీవీ తాను బలహీనుడను కాదనీ, తనదైన ఆలోచనా శక్తితో దృఢనిశ్చయంతో పనిచేయగలవాడిననీ అధినేత్రి ఇందిర ముందు నిరూపించుకోవాలనుకున్నారు. దానికి నాడు ఇందిరాగాంధీ ఇచ్చిన గరీబీ హఠావో నినాదానికి కొనసాగింపుగా ఉంటుందనీ, తద్వారా ఇందిర మెప్పుపొందవచ్చని తలచి భూ సంస్కరణల చట్టానికి శ్రీకారం చుట్టారు. 1972 మే 2 అర్ధరాత్రి ఆర్డినెన్స్ ద్వారా తనదైన మార్క్ పాలనకు మొదటి అడుగు వేశారు!
విదేశాంగ శాఖ మంత్రిగా, వివిధ హోదాల్లో పనిచేస్తున్నప్పుడు కూడా పలు సందర్భాల్లో మంథనికి ప్రత్యేకంగా వచ్చేవారు. ఆయన పాత స్నేహితులను కలుసుకునేవారు. కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ పనకంటి కిషన్రావు ఇంటికి వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకునేవారు. అక్కడే భోజనం చేసేవారు. దేశంలోని పేదలు ఏ మూల నుంచైనా సరే, మరొక మారుమూలలోని ప్రాంతవాసులతో సునాయాసంగా మాట్లాడగలగాలి. సాధారణ ఖర్చులతో దేశం మొత్తం చుట్టి రావాలి. అప్పుడే ఈ దేశం సగం అభివృద్ధి చెందినట్లు అని చెప్పారు. ఆయన పీఎం అయ్యాక దానిని నిజం చేసి చూపారు. లికమ్యూనికేషన్స్ రంగంలో నూతన శకానికి నాంది పలికారు.
– ఇంటర్వ్యూ మ్యాకం రవికుమార్