వనపర్తి, జనవరి 4 : రైతుల ఇంట వేరుశనగ పంట సి రులు కురిపిస్తున్నది. డిమాండ్ ఉంటే పంట ఎక్కడ ఉన్నా వ్యాపారులు పోటీపడి మరీ కొనుగోలు చేస్తారు. ఈ కోవలోకే వేరుశనగ వచ్చి చేరింది. వనపర్తి మార్కెట్ యార్డులో ఒక్కో పల్లి కుప్ప వద్ద దాదాపుగా 10 నుంచి 15 మంది వ్యాపారులు పోటీ పడుతున్నారు. దీంతో రికార్డు స్థా యిలో ధర పలుకుతున్నది. పెట్టుబడి, ఇతర ఖర్చులకు పోనూ అధిక లాభాలు రావడంతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారు. 2020 నవంబర్ నుంచి 2021 మార్చి వరకు వనపర్తి మార్కెట్కు 1,80,764 క్వింటాళ్లు రాగా.., 2021 నవంబర్ నుంచి 2022 జనవరి 2వ తేదీ వరకే 87 వేల క్వింటాళ్లు వచ్చింది. మిగిలిన మూడు నెలల్లో గ తేడాదిని అధిగమించనున్నట్లు అధికారులు చెప్పారు. రైతులందరూ ఒకే రకమైన పంట వేయడం వల్ల ధాన్యం ని ల్వలు పెరిగి డిమాండ్ తగ్గుతుంది. మద్దతు ధర అనుకున్నంత స్థాయిలో రాదు. ఈ నేపథ్యంలో డిమాండ్ లేని వ రి సాగు చేయొద్దని ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తున్నది. ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గుచూపేలా ప్రయత్నిస్తున్నది. కాగా, వనపర్తిలో పండిన వేరుశనగలో ఆఫ్లోటాక్సిన్ లేకపోవడం కూడా రైతులకు కలిసివస్తున్నది. వనపర్తి మార్కెట్ యార్డులో గడిచిన మూడేండ్లలో ఈ సా రి రికార్డు ధర వస్తున్నది. నియోజకవర్గం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల రైతులు సైతం తమ పంటను వనపర్తి మార్కెట్కు తీసుకొస్తున్నారు. అత్యధిక ధర పొందిన రైతులను అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ శాలువా, పూలమాలలతో సన్మానించడం గమనార్హం. నిత్యం పల్లి పంట గరిష్ఠ ధర పలుకుతున్నది. గత శనివారం వనపర్తి మార్కెట్ యార్డుకు 18,750 బస్తాలు రాగా.. క్వింటాకు గరిష్ఠంగా రూ.8216 ధర వచ్చింది. సోమవారం గరిష్ఠ ధర రూ.8117 పలికిందని అధికారులు తెలిపారు. మంగళవారం మార్కెట్కు సెలవు ఉన్నది.
పెరిగిన వేరుశనగ సాగు..
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పల్లెనిద్రలతోపాటు రైతులకు అవగాహన కల్పించడంతో జిల్లాలో పల్లిసాగు పెరిగింది. ఇక్కడి పంటలో ప్రధానంగా ఆఫ్లోటాక్సిన్ అనే శిలీంధ్రం ఉండదు. శిలీంధ్రం లేకపోవడంతో ఇక్కడి పల్లి నుంచి నూనె అధికంగా వస్తుంది. అంతేకాకుండా ఈ నూనె తినడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు దరిచేరవు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో వనపర్తి వ్యాపారస్తులే కాకుండా వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, శ్రీకాకుళం, ప్రొద్దుటూర్ నుంచి వ్యాపారస్తులు వస్తున్నారు. ఇక్కడి పంటను కొనుగోలు చేసిన వ్యాపారస్తులు ఉత్తర భారతదేశంలోని ముఖ్య పట్టణాలకు తరలించి.. అక్కడి నుంచి విమాన, సముద్ర మా ర్గాల ద్వారా విదేశాలకు ఎగుమతి చేసుకుంటున్నారు. కొం తమంది రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ధర తక్కువ వస్తున్నది. పంటను ఆరబెట్టకుండా మార్కెట్కు త్వరగా తీసుకొస్తున్నారు. దీంతో మద్దతుధర రావడం లేదు. అందుకే పంటను బాగా ఆరబెట్టిన తరువాత తీసుకురావాలని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా సాగు చేసే సమయంలో అత్యధికంగా నీరు పెడుతున్నారని.. దీంతో లొట్ట ఎక్కువగా.. బుడ్డగింజ తక్కువ గా వస్తుందని, నీరు తగినంత పెడితే మంచి పల్లి చేతికి వ స్తుందని అధికారులు సూచిస్తున్నారు.
నాణ్యమైన పల్లి తీసుకురావాలి..
వనపర్తి మార్కెట్ యార్డుకు నాణ్యవంతమైన పల్లిని తీసుకొచ్చి అధిక ధర పొందాలి. రేటు తగ్గుతుందన్న ఆందోళనతో రైతులు పంటను ఆరబెట్టకుండా తీసుకొస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆరబెట్టిన తరువాత తీసుకొస్తే మంచి ధర వస్తుంది. మార్కెట్లో ఇక్కడి వారే కాకుండా ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కూడా వస్తున్నారు. గిట్టుబాటు ధర విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.