హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగ నిర్ధారణ కేంద్రాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులు ఇప్పటికే ప్రమాణాల ప్రకారంగా డయాగ్నోస్టిక్ సౌకర్యాలను కలిగి ఉన్నాయి. దీనికి అదనంగా జిల్లా ఆస్పత్రుల్లో కొత్తగా డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే రెండు సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ల్యాబ్లలో 60 రకాల పరీక్షలు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి జిల్లా ఆస్పత్రుల్లో మరో 18 డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
పేద ప్రజానీకానికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ర్ట వ్యాప్తంగా డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి దశలోనే రోగాన్ని గుర్తించేందుకు ఈ సెంటర్లు ఉపయోగపడుతాయన్నారు. నారాయణగూడలో అధునాతన సదుపాయాలతో డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. 325 కేంద్రాల్లో(బస్తీ దవాఖానాలు, అర్బన్ పీహెచ్సీలు) శాంపిల్స్ను సేకరించి నారాయణగూడ ల్యాబ్కు పంపి రిపోర్టు ఆన్లైన్లో చేరవేస్తున్నామని తెలిపారు. రోజుకు 5 వేల శాంపిల్స్ను టెస్టు చేయడం జరుగుతుందన్నారు.
ఈ ల్యాబ్ ద్వారా వస్తున్న ఫలితాలను చూసిన తర్వాత వీటిని జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించాలని నిర్ణయించామన్నారు. సిద్దిపేట, కరీంనగర్, కొత్తగూడ, ఆసిఫాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జనగాం, జగిత్యాల, గద్వాల, మహబూబాబాద్, ములుగు, సిరిసిల్ల, నల్లగొండలో డయాగ్నోస్టిక్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో సిద్దిపేటలో ఇప్పటికే డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి ఈటల తెలిపారు.