వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని కామారెడ్డిగూడ, పీరంపల్లి గ్రామాల్లో మీతో నేను కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కామారెడ్డిగూడ సమీపంలో ఉన్న క్రషర్ మిషన్ను తొలగించాలని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు సరి చేయాలని, బావులకు జాలి అమర్చి ప్రమాదాలు జరుగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లోని ప్రకృతివనం, వైకుంఠధామం, నర్సరీలను తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధిలో వెనుక బడిన గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తుందన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందాలనే ఉద్ధ్యేశంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీరందిస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ, జడ్పీటీసీ ప్రమోదిని, ఎంపీడీవో సుభాషిణి, ఏఎంస్సీ చైర్మన్ విజయ్కుమార్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, డిప్యూటీ తాసీల్దార్ విజేందర్, వ్యవసాయాధికారి రమేశ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.