మంచాల ఆగస్టు 3 : మండలంలోని లింగంపల్లి గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. సర్పంచ్ పెర్క వినోద ఆధ్వర్యంలో పనులన్నీ చకచకా పూర్తయ్యాయి. సమస్యలతో సతమతమైన పల్లె.. పల్లె ప్రగతితో అన్ని మౌలిక వసతులను సమకూర్చుకున్నది. రెండున్నర ఏండ్ల కాలంలో రూ.కోటితో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలను పూర్తి చేశారు. నిత్యం వీధులను శుభ్రం చేయడంతో పాటు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. వర్మీ కంపోస్టు యార్డులో సేంద్రియ ఎరువును తయారు చేసి మొక్కలకు వినియోగిస్తున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు నిత్యం నీళ్లు పడుతున్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ నల్లా వేసి నీటిని సరఫరా చేస్తున్నారు. వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి ఉపయోగించుకుంటుండడంతో లింగంపల్లి స్వచ్ఛ గ్రామంగా మారింది. వైకుంఠధామం అందుబాటులోకి వచ్చింది. పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. అరటి, బొప్పాయి, జామ, సపోటా, మామిడి, చింత, ఉసిరి, దానిమ్మ వంటి పండ్ల మొక్కలు ఫలాలు ఇస్తున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలకు, పల్లె ప్రకృతి వనం, ఖాళీ స్థలాల్లో నాటిన మొక్కలకు పంచాయతీ ట్యాంకర్తో నీటిని పడుతున్నారు.
మారిన గ్రామం…
పల్లె ప్రగతితో లింగంపల్లి గ్రామ రూపురేఖలు మారాయి. పాడుబడ్డ ఇండ్లను తొలగించడం, రోడ్లపై చెత్త వేయకుండా చూడడం, తడి, పొడి చెత్త బుట్టలు పంపిణీ, మురుగు కాల్వలను శుభ్రం చేయడం, దోమల నివారణకు మురుగు నీటిని తొలగించి రసాయనాలను చల్లడం, పైపులైన్ల మరమ్మతుల వంటి పనులను పూర్తి చేశారు.
నిధుల కేటాయింపు..
రూ. 10 లక్షలతో వైకుంఠధామం, రూ.3.50లక్షలతో పల్లెప్రకృతి వనం, రూ. 2.50 లక్షలతో వర్మీ కంపోస్టు యార్డు, రూ.8లక్షల 40వేలతో ట్రాక్టర్, ట్యాంకర్ కొనుగోలు, తడి, పొడి చెత్త బుట్టలకు రూ. 75వేలు, రూ.50లక్షలతో సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీలను ఏర్పాటు చేశారు.
గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
లింగంపల్లి గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. పల్లెప్రగతి కార్యక్రమంతో ప్రభుత్వ నిధులను ప్రణాళిక ప్రకారం వినియోగిస్తున్నాం. పంచాయతీ పాలక వర్గం, గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. పంచాయతీ సిబ్బంది గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతున్నారు.
పల్లె ప్రగతి పనులు పూర్తి చేశాం..
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కంపోస్టు యార్డు, వైకుంఠధామం నిర్మాణాలు పూర్తి కాగా, అందుబాటులోకి వచ్చాయి. పల్లె ప్రకృతి వనంలో 4వేల మొక్కలను నాటాం. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు పంచాయతీ ట్యాంకర్తో నీళ్లు పోస్తున్నాం.