పరిగి, ఏప్రిల్ 24 : పరిగి నియోజకవర్గంలో చౌడాపూర్, మహ్మదాబాద్ రెండు నూతన రెవెన్యూ మండలాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. కులకచర్ల మండల పరిధిలోని చౌడాపూర్, మందిపల్, వీరాపూర్, విఠలాపూర్, మక్తవెంకటాపూర్, అడవి వెంకటాపూర్, లింగంపల్లి గ్రామాలతో పాటు నూతన జిల్లాల ఏర్పాటు సమయంలో మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం పరిధిలోకి మారిన కొత్తపల్లి, పుర్సంపల్లి, మల్కాపూర్, మరికల్, కన్మన్కల్వ, మొగిలిపల్లి, చాకల్పల్లి రెవెన్యూ గ్రామాలతో నూతన రెవెన్యూ మండలంగా చౌడాపూర్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శనివారం తుది నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతోపాటు పరిగి నియోజకవర్గం, మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని మహ్మదాబాద్, సంగాయపల్లి, అన్నారెడ్డిపల్లి, ముకర్లాబాద్, లింగాయిపల్లి, మంగంపేట్, చౌదర్పల్లి, గాధిర్యాల్, నంచర్ల, జూలపల్లి రెవెన్యూ గ్రామాలతో మహ్మదాబాద్ రెవెన్యూ మండలంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
రెండు నూతన రెవెన్యూ మండలాల ఏర్పాటుపై 2020 డిసెంబర్ 31వ తేదీన ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. 30 రోజుల్లో ప్రజల నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు స్వీకరించారు. అన్ని పరిశీలించిన తర్వాత శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ చౌడాపూర్, మహ్మదాబాద్ రెండు రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ను విడుదల చేశారు. నూతనంగా ఏర్పడిన చౌడాపూర్ మండలం వికారాబాద్ జిల్లా వికారాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో, మహ్మదాబాద్ మండలం మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంటాయి. తద్వారా నూతన జిల్లా ఏర్పాటు సమయంలో మహబూబ్నగర్ జిల్లా పరిధిలోకి మారిన కులకచర్ల మండలంలోని 7 రెవెన్యూ గ్రామాలు మళ్లీ వికారాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చాయి.
పరిగి నియోజకవర్గంలో చౌడాపూర్, మహ్మదాబాద్ రెండు మండలాలు ఏర్పాటు చేయాలని అనేక ఏండ్లుగా డిమాండ్ ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మండలాల ఏర్పాటు అంశం మరోసారి చర్చకు వచ్చింది. తనను గెలిపిస్తే తప్పనిసరిగా రెండు మండలాలు ఏర్పాటు చేయిస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత నూతన మండలాల ఏర్పాటుకు సంబంధించిన అంశం సీఎం కేసీఆర్కు స్వయంగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డి విన్నవించారు. మండలాల ఆవశ్యకత, తద్వారా ఆయా ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే సీఎం కేసీఆర్కు తెలియజేశారు. ఈ అంశంపై స్పందించిన సీఎం కేసీఆర్ రెండు మండలాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ప్రత్యేక కృషితో రెండు నూతన రెవెన్యూ మండలాలు ఏర్పాటు అయ్యాయి. సమైక్య రాష్ట్రంలో మండలాల వ్యవస్థ ఏర్పాటు సమయంలో పరిగి నియోజకవర్గంలో పరిగి, దోమ, కులకచర్ల, గండీడ్, పూడూరు అయిదు మండలాలు ఏర్పాటు చేశారు. రెండు కొత్త మండలాల ఏర్పాటుతో పరిగి నియోజకవర్గంలో మండలాల సంఖ్య ఏడుకు పెరిగింది. తద్వారా ఆయా గ్రామాలకు పాలన మరింత చేరువ అవుతున్నది.
కులకచర్ల, ఏప్రిల్ 24: చౌడాపూర్ను మండలంగా ప్రకటిస్తూ ప్రభుత్వం గెజిట్ను వెలువరించడంతో చౌడాపూర్ గ్రామంలో సంబురాలు జరుపుకున్నారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి హామీని నెరవేర్చారని యువజన సంఘాల సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కులకచర్ల పీఏసీఎస్ చైర్మన్ నాగరాజు, మరికల్ సర్పంచ్ పాండురంగయ్య, చౌడాపూర్ ఎంపీటీసీ శంకర్, గ్రామ పెద్దలు పాల నర్సింహులు, రాజయ్య, యాదయ్య, లక్ష్మయ్య, రమేశ్, రాములు, కృష్ణయ్య, చెన్నయ్య, కిషన్నాయక్, బన్సిలాల్, ఆంజనేయులు, శివుడు, రమేశ్, జంగయ్య, రామకృష్ణ, నర్సింహులు, వార్డు సభ్యుడు అశోక్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞత
పరిగి నియోజకవర్గంలో నూతనంగా చౌడాపూర్, మహ్మదాబాద్ రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు. మండలాలు ఏర్పాటు చేయాలని ఏండ్లుగా ఉన్న ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. నూతన మండలాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాలు మరింత అభివృద్ధి సాధిస్తాయి. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మరో రెండు మండలాలు పెరిగాయి. – రంజిత్రెడ్డి, ఎంపీ, చేవెళ్ల
ప్రజలకు మరింత చేరువగా పాలన
రెండు కొత్త మండలాల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత చేరువవుతున్నది. గత ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ, ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం చౌడాపూర్, మహ్మదాబాద్ రెండు రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేసింది. రెండు కొత్త రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు.