న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (నీట్-పీజీ) పరీక్షను సెప్టెంబర్ 11న నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. వాస్తవానికి గత ఏప్రిల్ 18న నీట్ (పీజీ) పరీక్ష జరుగాల్సి ఉంది. అయితే, అప్పటికే దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తుండటంతో పరీక్ష నిర్వహించాలన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కు వ్యతిరేకంగా పలువురు యువ డాక్టర్లు ఆందోళనకు దిగారు.
దాంతో అప్పటి ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ నీట్ (పీజీ) పరీక్ష నిర్వహణను వాయిదా వేశారు. ఆగస్టు చివరి వరకు పరీక్ష నిర్వహించబోమని స్పష్టంచేశారు. అయితే పరీక్ష నిర్వహణ తేదీని అభ్యర్థులకు ఒక నెల ముందుగానే తెలియజేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు సెప్టెంబర్ 11న నీట్ (పీజీ) పరీక్ష నిర్వహిస్తామని ఇవాళ ఆరోగ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కాగా, ఇప్పటికే నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షల నిర్వహణ తేదీని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 12న నీట్ పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.