సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : ఇంకుడు గుంతల నిర్మాణంపై పలు ప్లంబర్లు, మేస్త్రీలకు ఇచ్చిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వాతావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పొందిన వారికి ధ్రువీకరణపత్రాలు అందజేశారు.
హైదరాబాద్లో భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో వాటిని రీచార్జ్ చేయడానికి జలమండలి పలు చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి చెప్పారు. ట్యాంకర్లు ఎక్కువగా బుక్ చేసుకున్న 30వేల మంది ప్రాంగణాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేలా అవగాహన కల్పించామన్నారు. ఇందుకోసం 18 ఎన్జీవో సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే వారు 700 మందిని కలిసి ఇంకుడు గుంతల ప్రాముఖ్యం, నిర్మాణ పద్ధతిని వివరించినట్లు ఎండీ సుదర్శన్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం శిక్షణ పొందిన వారంతా హైదరాబాద్ నగరంలో ఇంకుడు గుంతలను నిర్మించుకునే వారికి సాంకేతిక సాయాన్ని అందిస్తారని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాల్ని పెంచేందుకు జలమండలి, ఈపీటీఆర్ఐ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా చర్యలు చేపట్టినట్లు ఎండీ వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్కుమార్, ఇంకుడు గుంతల ప్రత్యేకాధికారి జాల సత్యనారాయణ, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.