రంగారెడ్డి, జూన్ 14, (నమస్తే తెలంగాణ) : గత రెండేండ్లుగా అవసరానికి మించి వరి పంట సాగు కావడంతో ఈ ఏడాది వరి పంట సాగును చాలా వరకు తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను రైతులు సాగు చేసేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత రెండేండ్లుగా వరి పంట సాగు దేశవ్యాప్తంగా గణనీయంగా పెరగడంతో ధరలు తగ్గిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది వరి ధాన్యం మద్దతు ధర మరింత తగ్గే అవకాశాలున్నాయిజ దీంతో రైతులు వరి పంటను సాగు చేసి నష్టపోవాల్సిన పరిస్థితి ఉన్న దృష్ట్యా జిల్లా రైతాంగం వరికి బదులుగా పత్తి, కందులు, వేరుశనగ, పెసర, కూరగాయల పంటలను సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, ఫరూఖ్నగర్, కేశంపేట, నందిగామ మండలాల్లో ఎక్కువగా వరి సాగవుతున్నది. గతేడాది జిల్లావ్యాప్తంగా 71 వేల ఎకరాల్లో వరి పంటను జిల్లా రైతాంగం సాగు చేయగా, ఈ ఏడాది 40 వేల ఎకరాలకు తగ్గించాలని నిర్ణయించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 వేల ఎకరాల్లో వరి సాగు జిల్లావ్యాప్తంగా తగ్గించేందుకు రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.
పత్తికే ప్రాధాన్యత…
పత్తి పంట సాగుతోనే రైతులు అధిక మొత్తంలో లాభాలు ఆర్జించొచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలో పత్తి సాగును పెంచేలా అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. గతంలో ఎన్నడూలేనంతగా ఈ వానకాలం సీజన్లో పత్తిసాగును పెంచేందుకు రైతులను ప్రోత్సహించేందుకు వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో పండించే పత్తికి దేశీయంగా చాలా డిమాండ్ ఉండడం, ఎంత పత్తి పంటను సాగు చేసినా స్థానికంగానే ఆయా జిల్లాల్లోనే జిన్నింగ్ మిల్లుల ద్వారా సీసీఐ కొనుగోలు చేస్తుండడంతోపాటు ప్రభుత్వం మద్దతు ధర కూడా అందిస్తుండడంతో ప్రతి రైతు పత్తినే సాగు చేసేలా అధికార యంత్రాంగం ముందుకెళ్తుంది. రాష్ట్రవ్యాప్తంగా పత్తిసాగుకు అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం జిల్లాలోనూ 30 శాతం మేర పత్తి సాగు పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పత్తి పంట సాగుకు సంబంధించి భారీగా పెంచుతూ వ్యవసాయాధికారులు ప్రణాళికను రూపొందించడంతోపాటు ఆ దిశగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. గతేడాది జిల్లాలో 2.73 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగుకాగా, ఈ ఏడాది 3.10 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 37 వేల ఎకరాల్లో పత్తి సాగు పెరుగనుంది.
40 వేల ఎకరాలకుపైగా కంది సాగు…
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జిల్లాలో పత్తి సాగుతోపాటు కంది పంట సాగును పెంచేందుకు రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. కందులకు మంచి ధర ఉండడంతోపాటు ప్రతి రైతు వద్ద మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్న దృష్ట్యా కంది పంటను సాగు చేయడంపై దృష్టి పెట్టాలని జిల్లా వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో కంది పంట సాగును పెంచేందుకు నిర్ణయించారు. అయితే జిల్లాలో వరి సాగును భారీగా తగ్గించనున్న దృష్ట్యా పత్తితోపాటు కంది సాగును భారీగా పెంచేందుకు నిర్ణయించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కందులను రైతులు సాగు చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది జిల్లా నుంచి అధిక మొత్తంలో పప్పు ధాన్యాలను ఉత్పత్తి చేసేలా గ్రామగ్రామాన ప్రచారం నిర్వహిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కంది పంట సాగును 42,192 ఎకరాలకు పెంచుతూ నిర్ణయించారు. గతేడాది వానకాలం సీజన్లో 69,808 ఎకరాల్లో కంది పంట సాగుకాగా, ఈ ఏడాది 1.12 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో విత్తనాలను కూడా నాటినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాది 5,24,333 ఎకరాల్లో పంటల సాగు…
ఈ వానకాలం సీజన్లో 5,24,333 ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికను రూపొందించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 52,538 ఎకరాల్లో ఆయా పంటల సాగును పెంచుతూ నిర్ణయించారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 4,71,795 ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. అదేవిధంగా గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మొక్కజొన్న సాగును తగ్గిస్తూ నిర్ణయించారు. గతేడాదితో పోలిస్తే వరి సాగు తగ్గించగా, పత్తి, కంది పంటల సాగు పెంచారు. అదేవిధంగా జొన్న 28,500 ఎకరాలు, మొక్కజొన్న-22 వేలు, పెసర్లు-550 ఎకరాలు, మినుములు-140 ఎకరాలు, వేరుశనగ-60 ఎకరాలు, ఆముదం-341 ఎకరాలు, చెరుకు-37 ఎకరాలు, ఇతర పంటలు-5132 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేసి అందుకనుగుణంగా ప్రణాళికను రూపొందించారు.
ప్రణాళికతో ముందుకెళ్తున్నాం..
జిల్లాలో వరి పంట సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడంపై రైతులకు ఊరూరా అవగాహన కల్పిస్తున్నాం. రైతు వేదికల్లో గత వారం రోజుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుతో లాభాలపై విస్తృతంగా రైతులకు తెలియజేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు పత్తి, కంది పంటల సాగును గతేడాదితో పోలిస్తే భారీగా పెంచేలా ప్రణాళిక రూపొందించడంతోపాటు ఆ దిశగా చర్యలు చేపట్టాం.