అద్దాల్లాంటి దారులు.. పరిశుభ్రమైన డ్రైనేజీలు
సకల హంగులతో వైకుంఠధామం
తీరొక్క మొక్కలతో పల్లె ప్రకృతివనం
సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 5 : గతుకుల రోడ్లతో వెతలు పడ్డ సారంపల్లె పల్లె ప్రగతి స్ఫూర్తితో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది. కంపుకొట్టే డ్రైనేజీలతో ఇబ్బందులుపడ్డ ఆ ఊరు శుభ్రమైన మురుగుకాలువలతో మెరిసిపోతున్నది. పచ్చదనం లేక బోసిపోయిన గ్రామం ఇప్పుడు ఎవెన్యూ ప్లాంటేషన్తో హరిత శోభను సంతరించుకున్నది. సకల హంగులతో వైకుంఠధామం రూపుదిద్దుకున్నది. ఊరి శివారులో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనం తీరొక్క మొక్కలతో అలరారుతున్నది.తంగళ్లపల్లి మండలంలోని సారంపల్లె జనాభా 1850. అందులో స్త్రీలు 935, పురుషులు 915 మంది. 358 నివాస గృహాలు, 427 కుటుంబాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ లో ఐదుగురు పారిశుధ్య కార్మికులు ఉన్నారు. వీరికి ఏడాదికి 5,28,000 జీతాలు చెల్లిస్తున్నారు. జనాభా ప్రాతిపాదికన గ్రామానికి ఏడాదికి పల్లె ప్రగతి కింద 23.94 లక్షలు వస్తున్నాయి. అందులో 2,39 లక్షలు గ్రీనరీ కోసం కేటాయిస్తున్నారు.
ట్రాక్టర్కు ఏడాదికి 1.20 లక్షల కిస్తి కడుతున్నారు. ట్రాక్టర్, బ్యాటరీ రిక్షాలతో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. గ్రామంలో 858 చెత్తబుట్టలను పంపిణీ చేశారు. 25 లక్షల ఈజీఎస్ నిధులతో వైకుంఠధామం నిర్మించారు. డంప్ యార్డ్, కంపోస్ట్ షెడ్లను నిర్మించారు. తొలివిడుత పల్లె ప్రగతిలో భాగంగా 4 విరిగిన స్తంభాలను తొలగించి 15 కొత్త పోల్స్ వేశారు. 7100 మీటర్ల మూడో లైన్ వైరును బిగించారు. ఇప్పటికే 77 వీధీ దీపాలు ఉండగా కొత్తగా 70 ఎల్ఈడీ బల్బులు అమర్చారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనంలో ఆరువేల మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా 28468 మొక్కలు నాటగా 98.65 శాతం మొక్కలను సంరక్షించారు. 11 పాడుబడ్డ బావులను పూడ్చేశారు. దశాబ్దాల తరబడి మురికికూపంగా ఉన్న బొప్పాయి కుంటను శుభ్రం చేశారు. మట్టిరోడ్ల స్థానంలో సీసీ రోడ్లు నిర్మించారు. 358 మరుగుదొడ్లు, 127 వ్యక్తిగత, 3 కమ్యూనిటీ ఇంకుడు గుంతలను నిర్మించారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ మే ‘ప్యూర్ గోల్డ్’ పాన్! సోషల్ మీడియాలో వైరల్!!
ఆహారం పెట్టమని కుక్క ఎలా అడిగిందంటే..