పరిగి, జూలై 23 : రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ఏర్పాట్లను సిద్ధం చేశారు. శనివారం మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మొక్కలు నాటే కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలన్నది ప్రధాన ఉద్దేశం. జిల్లాలో ఒక్కరోజు సుమారు 5 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లను సిద్ధం చేశారు.
ప్రతి నియోజకవర్గంలో లక్షకు పైగా మొక్కలు..
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నేడు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో నాలుగు లక్షల మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగనున్నది. ప్రత్యేకంగా జిల్లా అటవీ శాఖ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో లక్ష మొక్కలు నాటనున్నారు. కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం గుండేపల్లి, అల్లాపూర్లలో 25వేల మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి పాల్గొంటారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు డిక్షనరీలను మంత్రి అందజేయనున్నారు. పరిగి నియోజకవర్గంలోని పరిగి మండలం ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో 25 హెక్టార్లలో 29వేల మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం పరిగి మున్సిపల్ పరిధిలోనూ ఎమ్మెల్యే పాల్గొంటారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి నుంచి కొత్తగడి వరకు మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొననుండగా, తాండూరు మున్సిపల్ పరిధిలోని కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి.మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డిలు పాల్గొంటారు. వికారాబాద్లో జరిగే కార్యక్రమంలో కలెక్టర్ పౌసుమి బసు పాల్గొంటారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ నియోజకవర్గంలో 17వేల మొక్కలు, తాండూరు నియోజకవర్గంలో 28వేల మొక్కలు నాటనున్నారు. ఇందులో భాగంగా కొడంగల్ ప్రాంతంలోని గుండేపల్లి, ధారూర్ మండలం గట్టేపల్లి, బషీరాబాద్ మండలం మైల్వార్, తాండూరు మండలం గొట్లపల్లి, అంతారం, పెద్దేముల్ మండలం అడికిచర్ల, నాగులపల్లి, మోమిన్పేట్ మండలం మోత్కుపల్లి, నవాబుపేట్ మండలం పులిమద్ది, పూడూరు అటవీ పరిధిలోని నస్కల్, పరిగి మండలంలోని ఇబ్రహీంపూర్, రంగంపల్లి, యాలాల్ మండలంలోని రాస్నం అటవీ ప్రాంతంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగనున్నది.
నాలుగు మున్సిపాలిటీల్లో..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్లలో లక్ష మొక్కలు నాటేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టారు. వీటితోపాటు జిల్లా పరిధిలోని 565 గ్రామపంచాయతీలలోనూ మొక్కలను నాటనున్నారు.
రోడ్ల పక్కన మొక్కలు…
జిల్లాలోని ఆయా గ్రామాల్లో రోడ్ల పక్కన మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు మినహా, అత్యధికంగా గ్రామాలకు వెళ్లే రహదారుల పక్కన మొక్కలు నాటడం జరుగుతుంది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నాటిన ప్రతి మొక్క బతికే అవకాశం ఉన్నది.
తులేకలాన్, గున్గల్ ఫారెస్టు ప్రాంతంలో..
ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్, యాచారం మండలం గున్గల్ ఫారెస్టు ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 2లక్షల మొక్కలు నాటేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో గుంతలు తీశారు. మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, అటవీశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. తులేకలాన్ అటవీ ప్రాంతంలో లక్ష మొక్కలు, గున్గల్ అటవీ ప్రాంతంలో లక్ష మొక్కలు, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో లక్ష మొక్కలు నాటనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పేర్కొన్నారు. 9.30గంటలకు గున్గల్ చౌరస్తాకు మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కిషన్రెడ్డికి ఘన స్వాగతం పలుకాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి పాచ్ఛ భాష పిలుపునిచ్చారు.
ముక్కోటి వృక్షార్చన అద్భుత కార్యక్రమం.. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చన అద్భుత కార్యక్రమమని మంత్రి సబితారెడ్డి అన్నారు. నేడు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో కలిసి వృక్షార్చన, లక్ష మంది విద్యార్థులకు డిక్షనరీల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామన్నారు. మంత్రి కేటీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలోని గుండేపల్లి, అల్లాపూర్ గ్రామాల్లో పర్యటించి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు.