యాదాద్రి: ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి భక్తులకు వైకుంఠ ద్వారదర్శనం ఇచ్చారు. స్వామివారి బాలలయంలో తూర్పు ద్వారం గుండా ఉదయం 6.49 గంటలకు స్వామి వారు దర్శనమిచ్చారు. కొండ కింద కొలువై ఉన్న పాతగుట్ట దేవస్థానంలో కూడా స్వామివారు భక్తులకు ఉదయం 6.49 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ఇచ్చారు. కొవిడ్ నిబంధనల కారణంగా భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్ష్మీసమేత నారసింహుడిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలు, వజ్రవైడూర్యాలతో ప్రత్యేక సేవపై స్వామివారిని చూడముచ్చటగా అలంకరించారు. ఉదయం 6:49 నుంచి దాదాపు 2 గంటలపాటు స్వామివారు వైకుంఠ ద్వారదర్శనం ఇవ్వనున్నారు. వైకుంఠ ద్వారదర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు.
నేటినుంచి యాదాద్రి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. గురువారం నుంచి ఈ నెల 18 వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. అధ్యయనోత్సవాల సందర్భంగా అధికారులు పలు కార్యక్రమాలను రద్దుచేశారు.
ఇందులో భాగంగా మొక్కు శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలు, ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేడు లక్ష పుష్పార్చన రద్దు చేశారు. భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.