మీ ఫ్రెండ్ ఎవరైనా మెట్రో రైల్లో పార్టీ చేసుకుంటున్నాను అని చెబితే నమ్మేయండి!! ఎందుకంటే అది నిజం కాబోతున్నది. మెట్రో రైళ్లలో బర్త్డే, ప్రీ వెడ్డింగ్ షూట్, వివాహ వార్షికోత్సవాల్లాంటి చిన్నచిన్న పార్టీలు చేసుకునేందుకు నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎన్ఎంఆర్సీ) త్వరలోనే అనుమతించనుంది. మెట్రోను సరసమైన పార్టీ వేదికగా మార్చేందుకు ఎన్ఎంఆర్సీ కసరత్తు చేస్తున్నది.
కేవలం ప్రయాణికులను ఓ చోటునుంచి మరోచోటుకు చేరవేయడం ద్వారానే కాకుండా పార్టీల ద్వారా కూడా ప్రజలను ఆకర్షించి, లాభాల్లోకి రావాలని ఎన్ఎంఆర్సీ లక్ష్యంగా పెట్టుకుంది. నోయిడా మెట్రోను 2020లో ప్రారంభించారు. ఈ ఏడాది మార్చి 28న అత్యధికంగా 29,071 మంది మెట్రో సేవలను వినియోగించుకున్నారు. ఇదిలా ఉండగా, ఎన్ఎంఆర్సీ, తన మెట్రో కోచ్లను సినిమాలు, యాడ్స్ షూటింగ్స్ కోసం కూడా అద్దెకు ఇస్తున్నది. పార్టీలు చేసుకునేవారు వారిష్టం వచ్చినట్లు బోగీలను డెకొరేట్ చేసుకునే అవకాశం కూడా కల్పించనుంది.
ప్రతి కోచ్లో ఒక సెంట్రల్ టేబుల్ ఏర్పాటు చేయనున్నది. ఒకటి నుంచి నాలుగు కోచ్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కోచ్లు బుక్ చేసుకోవాలనుకునేవారు ఉదయం ఆరు గంటలనుంచి రాత్రి 10.45 గంటల వరకు స్టేషన్లో సంప్రదించవచ్చు. మిడ్నైట్ పార్టీలు చేసుకోవాలనుకునేవారు రాత్రి 11 గంటలనుంచి ఉదయం 2 గంటల వరకు స్టాటిక్ మెట్రో రైళ్లలో కోచ్లు బుక్ చేసుకోవచ్చు. డెకొరేషన్ లేకుండా గంటకు 8వేలు, అదే స్టాటిక్ ట్రైన్లలో రూ. 5వేలు చెల్లించాలి. డెకొరేషన్తో అయితే మెట్రోలో రూ. 10,000, స్టాటిక్ ట్రైన్లలో అయితే రూ. 7వేలు చెల్లించాల్సి ఉంటుంది.