చెన్నై: ఒక ఏనుగు రోడ్డును అడ్డగించింది. దీంతో నిలిచిన అంబులెన్స్లో ఒక మహిళ ప్రసవించింది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అటవీ ప్రాంతానికి చెందిన నిండు గర్భవతి అయిన 24 ఏండ్ల గిరిజన మహిళకు గురువారం పురుటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే ఆ ఘాట్ రోడ్డుపైకి ఒక ఏనుగు వచ్చింది. రోడ్డుకు అడ్డంగా అది ఉండటంతో అంబులెన్స్ నిలిచిపోయింది. అర గంట అయినప్పటికీ ఏనుగు అక్కడి నుంచి కదల లేదు.
మరోవైపు అంబులెన్స్లో ఉన్న గర్భిణీకి పురుటి నొప్పులు ఎక్కువయ్యాయి. అందులోని వైద్య సిబ్బంది ఆమె ప్రసవానికి సహకరించారు. దీంతో పండంటి బాబుకు ఆ మహిళ జన్మనిచ్చింది. ఇది జరిగిన కొంత సేపటికి ఆ ఏనుగు అక్కడి నుంచి కదిలింది. రోడ్డును వదలి అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో మహిళతోపాటు పసి బిడ్డను అంబులెన్స్లో స్థానిక గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.