రాంచి: యువ రెజ్లర్ను చెంపదెబ్బలు కొడుతూ భారతీయ జనతాపార్టీకి చెందిన ఓ ఎంపీ కెమెరా కంటికి చిక్కారు. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జార్ఖండ్ రాజధాని రాంచిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ రాజధాని రాంచిలో నేషనల్ చాంపియన్షిప్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్కు బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈవెంట్ కొనసాగుతుండగా ఓ యువ రెజ్లర్ తనకు కూడా ఈ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని పట్టుబట్టాడు. అయితే, అది అండర్-15 ఛాంపియన్ షిప్ అని, యువ రెజ్లర్ వయసు 15కు పైనే ఉన్నదని నిర్వాహకులు చెప్పారు. దాంతో ఎంపీ ఆ యువ రెజ్లర్ను స్టేజీపైకి పిలిచి మరీ చెంపదెబ్బలు కొట్టారు. మీడియా ప్రతినిధుల ముందే ఈ ఘటన జరుగడంతో ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
కాగా, ఎంపీ బ్రిజ్భూషణ్ ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడి హోదాలో ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, ఎంపీ తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. యువ రెజ్లర్పై చేయిచేసుకోకుండా నచ్చజెబితే బాగుండేదంటున్నారు. ఘటనను ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించండి.