డెహ్రాడూన్: ఏడాదిలో పిల్లల్ని కనండి లేదా పరిహారంగా రూ.5 కోట్లు చెల్లించండి అని కుమారుడు, కోడలికి వృద్ధ దంపతులు అల్టిమేటమ్ జారీ చేశారు. ఈ మేరకు వారు కోర్టును ఆశ్రయించారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు చెందిన ఎస్ఆర్ ప్రసాద్ దంపతులు తమ కుమారుడికి 2016లో ఘనంగా పెళ్లి చేశారు. అయితే ఆ జంట అమెరికాలో సంపాదనలో పడి ఇప్పటి వరకు పిల్లల్ని కనలేదు. మరోవైపు ప్రసాద్ తన ఆస్తుపాస్తులన్నీ కుమారుడికి అప్పగించాడు. అతడు జీవితంలో స్థిరపడేందుకు అమెరికాలో శిక్షణ ఇప్పించాడు. దీంతో కుమారుడు, కోడలు అమెరికాలో స్థిరపడ్డారు. ప్రసాద్ దంపతుల గురించి వారు పట్టించుకోవడం లేదు.
మరోవైపు ప్రసాద్ దంపతులు ప్రస్తుతం ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్నారు. ఉన్నదంతా కుమారుడికి ఇచ్చేయడంతో వారి వద్ద ఆస్తుపాస్తులేమీ లేవు. దీంతో ఇంటిని కట్టుకునేందుకు బ్యాంకులో లోన్ తీసుకున్నారు. నెలవారీ వాయిదాలు కట్టేందుకు కూడా వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ దంపతులు కోర్టును ఆశ్రయించారు. కుమారుడు, కోడలు ఏడాదిలోగా ఒక బిడ్డను కనాలని, లేని పక్షంలో చెరో రూ.2.5 కోట్లు చొప్పున రూ.5 కోట్లు పరిహారంగా తమకు ఇప్పించాలని కోర్టును కోరారు.
కాగా, ఈ కేసు సమాజంలో ప్రస్తుతం నెలకొన్న వాస్తవానికి అద్దం పడుతున్నదని ప్రసాద్ దంపతుల తరుఫు న్యాయవాది ఏకే శ్రీవాస్తవ అన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై పెట్టుబడిపెడతారని, వారు మంచి కంపెనీలో ఉద్యోగం చేసేలా తీర్చిదిద్దుతారని చెప్పారు. ఈ నేపథ్యంలో వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రుల కనీస ఆర్థిక అవసరాలను తీర్చాల్సిన బాధ్యత పిల్లలకు ఉంటుందన్నారు. అందుకే ఆ దంపతులు ఏడాదిలోగా గ్రాండ్ చిల్డ్రన్ లేదా రూ.5 కోట్ల పరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారని ఆయన వెల్లడించారు.