పొరపాటున రైలు ఒక ఐదు నిమిషాలు ఆలస్యమైతేనే కొన్ని దేశాల్లో ఆ ట్రైన్ డ్రైవర్పై చర్యలు తీసుకుంటున్నారు. అలాంటిది కావాలని డ్రైవరే రైలును ప్రయాణం మధ్యలో ఆపేస్తే? ఇదిగో ఇలాంటి ఘటనే తాజాగా పాకిస్తాన్లో జరిగింది. ఇక్కడ రాణా మహమ్మద్ షెహజాద్ అనే రైలు డ్రైవర్, అతని అసిస్టెంట్ ఇఫ్తికార్ హుస్సేన్ ఒక రైల్లో వెళ్తున్నారు.
ఆ రైల్లో చాలా మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. ఇలా ప్రయాణిస్తున్న వారందరికీ ఆశ్చర్యం కలిగించేలా కహ్నా కచ్ రైల్వే స్టేషన్ వద్ద రైలు ఆగిపోయింది. ఎందుకు ఆగిందీ ఎవరికీ అర్ధం కాలేదు. అయితే ఆ తర్వాత వైరలైన ఒక వీడియోలో ఈ ప్రశ్నకు సమాధానం లభించింది. ఈ రైల్వే స్టేషన్ సమీపంలో పెరుగు (యోగర్ట్) కొనుక్కోవడం కోసం ఆ డ్రైవర్.. రైలు ఆపేశాడు.
ఈ వీడియో బాగా వైరల్ అయ్యి ఏకంగా ఆ దేశ రైల్వే మంత్రి ఆజమ్ ఖాన్ స్వాతి దృష్టికి వెళ్లింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. సదరు డ్రైవర్, అతని అసిస్టెంట్ను సస్పెండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కాగా, ఇటీవలే రైలు డ్రైవర్లు డ్యూటీలో ఉండగా సెల్ఫీలు తీసుకోవడం, ఫోన్లు మాట్లాడటం కూడా చేయొద్దని ఇక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.