పుణె: అటవీ సమీప గ్రామాల్లోకి అప్పుడప్పుడు ఏనుగులు, పులులు, చిరుత పులులు వంటి వన్యప్రాణులు వస్తుండటం సహజమే. ఇలా గ్రామాల్లోకి వచ్చి వన్య ప్రాణులు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి, అదేవిధంగా వన్య ప్రాణులే మనుషుల ప్రాణాలు తీసిన సందర్భాలూ ఉన్నాయి. కానీ, గతంలో ఎప్పుడూ లేనివిధంగా తాజాగా మూడు చిరుత కూనలు దారితప్పి గ్రామంలోకి చొరబడ్డాయి.
ఫుణె జిల్లాలోని హింజావాడి తాలూకా నేరే గ్రామంలోకి ఆ చిరుత కూనలు వచ్చాయి. దాంతో గ్రామస్తులు విషయాన్ని అటవీ అధికారులకు చేరవేశారు. విషయం తెలిసి గ్రామానికి వచ్చిన అధికారులు ఆ మూడు చిరుత కూనలను బోనులో వేశారు. వాటిలో రెండు మగవి, ఒకటి ఆడది ఉన్నది. వాటి వయసు 15 రోజుల నుంచి నెల మధ్య ఉంటుందని చెప్పారు.
ఆ చిరుత కూనలను స్థానిక అటవీశాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. అటవీశాఖ అధికారులే వాటి సంరక్షణ బాధ్యతలు చూస్తున్నారు. అదేవిధంగా చిరుత కూనలను తల్లితో కలిపేందుకు.. తల్లి చిరుత జాడ కోసం సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.